A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) ఆగస్టు 2:
మెదక్ జిల్లా (1) భూ రీసర్వే పూర్తయిన గ్రామాల్లో భూ సంబంధిత సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు నూతన డిజిటల్ సాఫ్ట్వేర్ను రూపొందిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎన్ఐసి ఆధ్వర్యంలో అభివృద్ధి చేస్తున్న సాఫ్ట్వేర్పై జాయింట్ డైరెక్టర్ (సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్) లక్ష్మీప్రసన్న, ఎన్ఐసి సైంటిస్ట్ సి.సి. సంధ్య, ఏడీ ల్యాండ్ రికార్డ్స్ కిషన్ తదితర అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, భూ రీసర్వే జరిగిన గ్రామాల్లో భూ పహానీకి సంబంధించిన ఒకటి నుంచి ఎనిమిది అంశాల వరకు క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలను ఈ సాఫ్ట్వేర్ ద్వారా పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. నిజమైన పట్టాదారు ఎవరు, భూమి ప్రస్తుతం ఎవరి ఆధీనంలో ఉంది, భూ పహానీ మరియు కాస్ట్రాలో నమోదైన వివరాలు వంటి అంశాలను సమగ్రంగా పరిశీలించి పరిష్కరించే విధంగా సాఫ్ట్వేర్ను రూపొందిస్తున్నామని చెప్పారు.
ఈ నూతన సాఫ్ట్వేర్ను వారం రోజుల్లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. మెదక్ మండలంలోని కోమటూరు గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి ఆధునిక సాంకేతికతతో డిజిటల్ సర్వే చేపట్టి భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం కోమటూరు గ్రామంలో సర్వే శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి భూ సంబంధిత సమస్యలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

