A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) ఆగస్టు 2:
మెదక్ జిల్లా (1)మెదక్ మండలం ర్యాలమడుగు గ్రామంలోని కల్లు దుకాణం వెనుకవైపు బొమ్మా బొరుసు ఆడుతున్న స్థావరంపై టాస్క్ఫోర్స్ పోలీసులు ఆకస్మిక దాడి నిర్వహించి తొమ్మిది మందిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 7,910 నగదు, ఆరు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వారిలో శేఖర్, యాదగిరి, చంద్రశేఖర్, ప్రవీణ్, చంద్రం, కిష్టయ్య, పోలె లక్ష్మణ్, దుర్గేష్, నిఖిల్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు మాట్లాడుతూ జిల్లాలో జూదం, పేకాట, బొమ్మా బొరుసు వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. యువత జూదం, బెట్టింగ్లకు దూరంగా ఉండాలని సూచించారు. ఇలాంటి అక్రమ కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు అందించాలని కోరారు. ప్రజల భద్రతకు విఘాతం కలిగించే అసాంఘిక కార్యకలాపాలపై జిల్లా వ్యాప్తంగా నిరంతర నిఘా కొనసాగుతుందని ఎస్పీ తెలిపారు.

