జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్
A2న్యూస్, జులై 2, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)
మెదక్ జిల్లా (1)ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలు క్షేత్రస్థాయిలో పకడ్బందీగా అమలు చేసి పరిశుభ్రమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు.బుధవారం సమీకృత కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు ఇంటి వద్దనే చెత్తను నాలుగు రకాలుగా వేరు చేసి గ్రామపంచాయతీ లేదా మున్సిపల్ సిబ్బందికి అందించాలని సూచించారు.తడి చెత్తకు ఆకుపచ్చ, పొడి చెత్తకు నీలం, సానిటరీ చెత్తకు ఎరుపు, ప్రత్యేక జాగ్రత్త చెత్తకు నలుపు రంగు డస్ట్బిన్లను వినియోగించాలని తెలిపారు.
జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీలు, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, పరిశ్రమలు, షాపులు, హోటళ్లు, ఆస్పత్రులు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లలో తప్పనిసరిగా చెత్తను నాలుగు రకాలుగా వేరు చేసి ఇవ్వాలని అధికారులకు, ప్రైవేట్ యాజమాన్యాలకు, మహిళా సంఘాలకు, ప్రజలకు సూచించారు.తడి చెత్తలో మిగిలిన ఆహారం, వంటింటి వ్యర్థాలు, కూరగాయలు, పండ్ల తొక్కలు, పూలు, మాంసం వ్యర్థాలు ఉంటాయని, వీటితో కంపోస్ట్ ఎరువు తయారు చేయవచ్చన్నారు. పొడి చెత్తలో కాగితం, అట్టపెట్టెలు, ప్లాస్టిక్, లోహ వస్తువులు, సీసాలు, రబ్బరు వంటి రీసైక్లింగ్ చేయగల పదార్థాలు ఉంటాయని వివరించారు.సానిటరీ చెత్తలో డైపర్లు, సానిటరీ ప్యాడ్లు, న్యాప్కిన్లు, కండోమ్లు తదితర వ్యర్థాలను ప్రత్యేకంగా సేకరించి ఇన్సినరేటర్ యంత్రాల ద్వారా నిర్వీర్యం చేస్తారని తెలిపారు. పెయింట్ డబ్బాలు, బల్బులు, పురుగుమందుల డబ్బాలు, గడువు ముగిసిన మందులు, వైద్య వ్యర్థాలు, ఈ-వేస్ట్ వంటి ప్రత్యేక జాగ్రత్త చెత్తను గుర్తింపు పొందిన రీసైక్లింగ్ కేంద్రాలకు పంపిస్తామని చెప్పారు.గ్రామపంచాయతీల్లో నాలుగు రకాల చెత్తను సేకరించేందుకు ట్రాక్టర్లలో ప్రత్యేక డస్ట్బిన్లు ఏర్పాటు చేస్తున్నామని, సర్పంచులు, వార్డు సభ్యులు, లీడ్ ఫెసిలిటేటర్లు ఇంటింటికి వెళ్లి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారని తెలిపారు. బల్క్ వేస్ట్ జనరేటర్లు తప్పనిసరిగా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ను పాటించాలని కలెక్టర్ సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు, అడిషనల్ కలెక్టర్ నగేష్, అడిషనల్ ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, జిల్లా పరిషత్ సీఈఓ ఎల్లయ్య, డీఆర్డీఓ శ్రీనివాసరావు, డీఆర్వో అంబదాస్ రాజేశ్వర్, తహసీల్దార్లు, డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు తదితర అధికారులు పాల్గొన్నారు.

