A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) ఆగస్టు 5:
మెదక్ జిల్లా (4) పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ పేర్కొన్నారు. మంగళవారం హవేలీఘనాపూర్ మండలంలోని పోచారం అభయారణ్యాన్ని ఆయన సందర్శించారు. అనంతరం పోచారం డ్యాంలో వరద ఉధృతిని పరిశీలించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, ప్రకృతిని పరిరక్షించడం ద్వారా భావితరాలకు మెరుగైన భవిష్యత్తును అందించవచ్చని అన్నారు. ప్రకృతిని కాపాడినప్పుడే మానవ జీవితానికి సార్థకత ఉంటుందని పేర్కొన్నారు. జీవ వైవిధ్యం మానవ మనుగడకు ఆధారమని, పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు.
అనంతరం పోచారం డ్యాంలో వరద పరిస్థితిని పరిశీలించిన ఆయన, అక్కడ విధులు నిర్వహిస్తున్న అధికారులకు, సిబ్బందికి అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక తహసీల్దార్ సింధు రేణుక, ఆర్ఐ సిద్ధు, సంబంధిత శాఖల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

