వంతెనకు 2.30 కోట్ల ప్రతిపాదనలు – అత్యవసర మరమ్మతులకు రూ.15 లక్షలు మంజూరు
మల్కాపూర్ తండా, దూప్సింగ్ తండాలో అభివృద్ధి పనుల పరిశీలన – బాధిత కుటుంబానికి పరామర్శ
A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) ఆగస్టు 3:
మెదక్ జిల్లా (2) భారీ వర్షాల ప్రభావంతో దెబ్బతిన్న ప్రాంతాల్లో మెదక్ ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ రావు ఆదివారం విస్తృతంగా పర్యటించి ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించారు. రహదారులు, వంతెనలు, గ్రామీణ రవాణా మార్గాల పరిస్థితిని అధికారులతో కలిసి సమీక్షించి, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మొదట మెదక్ మండలంలోని రైన్పల్లి వంతెనను పరిశీలించిన ఎమ్మెల్యే, శాశ్వత పునర్నిర్మాణం కోసం రూ.2.30 కోట్ల అంచనాతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. తక్షణ మరమ్మతుల కోసం రూ.15 లక్షలు మంజూరు చేసి పనులు ప్రారంభించినట్లు వెల్లడించారు. వర్షాకాలం ముగిసే వరకు హెచ్చరిక బోర్డులు, బారికేడ్లు ఏర్పాటు చేసి ప్రజల భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం మల్కాపూర్ తండాలో ఇటీవల స్కూల్ బస్సు చిక్కుకున్న ప్రాంతాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. విద్యార్థుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, వంతెన నిర్మాణాన్ని వేగవంతం చేయడంతో పాటు అవసరమైతే ప్రత్యామ్నాయ రవాణా మార్గాలను సిద్ధంగా ఉంచాలని సూచించారు. తదుపరి హవేలీ ఘన్పూర్ మండలం దూప్సింగ్ తండాలో రూ.3 కోట్లతో నిర్మించిన వంతెనను పరిశీలించి నిర్మాణ నాణ్యతపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ వంతెనతో తండా ప్రజలు, రైతులు, విద్యార్థులకు రాకపోకలు మరింత సులభతరం అవుతాయని పేర్కొన్నారు. ఆ తర్వాత బర్గ్పల్లి గ్రామంలో పిడుగుపాటుకు మృతి చెందిన శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రభుత్వ పరంగా అందాల్సిన అన్ని రకాల సహాయాన్ని త్వరితగతిన అందించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం ముక్తా భూపతిపూర్ గ్రామంలో జరిగిన కుటుంబ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే, స్థానిక ప్రజలతో సమావేశమై తాగునీరు, రహదారులు, డ్రైనేజీ, మౌలిక సదుపాయాల సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
పర్యటన సందర్భంగా అన్ని శాఖల అధికారులకు వర్షాల ప్రభావంతో ఏర్పడిన సమస్యలపై వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే ఆదేశించారు. ప్రజల ఫిర్యాదులపై క్షేత్రస్థాయిలో స్పందిస్తూ అవసరమైతే ప్రత్యేక బృందాలతో సహాయక చర్యలను వేగవంతం చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ రావు మాట్లాడుతూ, “ప్రజల భద్రత, అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. భారీ వర్షాల వల్ల ఎక్కడ సమస్యలు వచ్చినా తక్షణమే స్పందించి, తాత్కాలిక మరమ్మతులతో పాటు శాశ్వత పరిష్కారాల కోసం అవసరమైన నిధులు తీసుకువచ్చి అభివృద్ధి పనులు పూర్తి చేస్తాం” అని తెలిపారు. ఈ పర్యటనలో సంబంధిత శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, గ్రామ పెద్దలు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

