A2న్యూస్, జూలై 21, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)
మెదక్ (20) ప్రజల సమస్యల పరిష్కారానికి నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రజలు సమర్థవంతంగా వినియోగించుకోవాలని, అందిన ప్రతి ఫిర్యాదుపై చట్టబద్ధంగా, పారదర్శకంగా విచారణ చేపట్టి తక్షణ చర్యలు తీసుకోవాలని మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస్ రావు సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఎస్పీ స్వయంగా ప్రజల నుంచి వినతులు, ఫిర్యాదులను స్వీకరించి ఒక్కో అర్జీని పరిశీలించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు వ్యక్తిగత, సామాజిక, భూ వివాదాలు, మోసాలు, వేధింపులకు సంబంధించిన సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు.
ప్రతి ఫిర్యాదుపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఎస్పీ ఆదేశించారు. ప్రజావాణి ద్వారా వచ్చిన వినతుల పరిష్కారంలో ఎలాంటి జాప్యం ఉండకూడదని, ప్రతి ఫిర్యాదుదారునికి వారి ఫిర్యాదు పురోగతిపై ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని సూచించారు. ప్రజల సమస్యలను వేగంగా, పారదర్శకంగా పరిష్కరించడం ద్వారా పోలీసు వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసం మరింత పెరుగుతుందని ఎస్పీ పేర్కొన్నారు. ఎలాంటి భయం లేదా సంకోచం లేకుండా తమ సమస్యల పరిష్కారం కోసం పోలీసులను సంప్రదించాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు.

