రికార్డుల నిర్వహణ, పెండింగ్ కేసుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలి
A2న్యూస్, మనోహరాబాద్ ప్రతినిధి (జల్లి రామకృష్ణ) సెప్టెంబర్ 16:
మనోహరాబాద్ (15) తూప్రాన్ డీఎస్పీ నరేందర్ మనోహరాబాద్ పోలీస్ స్టేషన్ను సందర్శించి స్టేషన్లోని వివిధ రికార్డులను పరిశీలించారు. అనంతరం పోలీస్ స్టేషన్ సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించి శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు పలు కీలక సూచనలు చేశారు. పోలీస్ స్టేషన్లోని అన్ని రికార్డులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ సక్రమంగా నిర్వహించాలని డీఎస్పీ సూచించారు. డయల్-112కు వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించి బాధితులకు త్వరితగతిన సేవలు అందించాలని ఆదేశించారు. వినాయక మండపాలను క్రమం తప్పకుండా సందర్శించి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించాలని, అన్ని పాయింట్ బుక్స్ను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని సూచించారు.ఎంఓ (ఎం ఓ) నేరస్తులను తప్పనిసరిగా తనిఖీ చేస్తూ వారి కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలని తెలిపారు. పెండింగ్లో ఉన్న యు ఐ కేసులను తగ్గించేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రతిరోజూ రోల్కాల్ నిర్వహించి సిబ్బందికి అవసరమైన సూచనలు ఇవ్వాలని పేర్కొన్నారు. పిటిషన్లను వెంటనే నమోదు చేసి, పిటిషనర్లకు సకాలంలో తగిన స్పందన అందించాలని సూచించారు. అలాగే ఆస్తి నేరాలను ఛేదించడంతో పాటు దొంగిలించబడిన ఆస్తుల రికవరీపై ప్రత్యేక దృష్టి పెట్టాలని డీఎస్పీ ఆదేశించారు. వినాయక చవితి సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు చేపట్టి శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తూప్రాన్ సీఐ వెంకటరాజా గౌడ్ ఎస్సై సుభాష్ గౌడ్ తో పాటు పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

