ఈ నెల 27 నుంచి 29 వరకు జిల్లాలోని 21 రైతు వేదికల్లో విత్తన మేళాలు
రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి: జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్
A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) జూలై 27:
మెదక్ జిల్లా (26) రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 27 నుంచి 29వ తేదీ వరకు జిల్లాలోని 21 రైతు వేదికల్లో విత్తన మేళాలను నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఈ ఏడాది ఎల్నినో ప్రభావంతో వర్షపాతం లోటు ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ సూచించిన నేపథ్యంలో తక్కువ నీటితో సాగు చేయగల ప్రత్యామ్నాయ పంటలను రైతులకు పరిచయం చేసి ప్రోత్సహించడం ఈ విత్తన మేళాల ప్రధాన ఉద్దేశమని తెలిపారు. వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు సాంప్రదాయ వరి సాగుకు బదులుగా కంది, పెసర, మినుము, మొక్కజొన్న, కూరగాయల వంటి ప్రత్యామ్నాయ పంటలను సాగు చేస్తే తక్కువ నీటితోనే మంచి దిగుబడులు సాధించి ఆర్థికంగా లాభపడే అవకాశముందని పేర్కొన్నారు.
నాణ్యమైన విత్తనాలు అందుబాటులో
విత్తన మేళాల్లో కంది, పెసర, మినుము, మొక్కజొన్న, కూరగాయల విత్తనాలు నాణ్యమైనవి రైతులకు అందుబాటులో ఉంటాయని కలెక్టర్ తెలిపారు.
ఈ రైతు వేదికల్లో విత్తన మేళాలు
అల్లాదుర్గ్, రేగోడు, శంకరంపేట (ఏ), టేక్మాల్, కౌడిపల్లి, చిల్పిచేడ్, కుల్చారం, వెల్దుర్తి, మాసాయిపేట, నర్సాపూర్, శివంపేట్, మనోహరాబాద్, తూప్రాన్, మెదక్, హవేలీఘన్పూర్, పాపన్నపేట్, శంకరంపేట (ఆర్), చేగుంట, నర్సింగ్, నిజాంపేట, రామాయంపేట మండల క్లస్టర్లలో విత్తన మేళాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. వరి సాగుకు బదులుగా ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయదలచిన రైతులు తమ సమీప రైతు వేదికలను సందర్శించి, వ్యవసాయ శాఖ అధికారుల సూచనల మేరకు తమ ప్రాంతానికి అనువైన నాణ్యమైన విత్తనాలను పొందాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించేందుకు వ్యవసాయ శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. అలాగే ప్రజాప్రతినిధులను కూడా విత్తన మేళాలకు ఆహ్వానించాలని సూచించారు. రైతులందరూ ఈ నెల 27 నుంచి 29 వరకు నిర్వహించే విత్తన మేళాలకు హాజరై ప్రభుత్వ సేవలను, నాణ్యమైన విత్తనాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ విజ్ఞప్తి చేశారు.

