ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలి : జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస్ రావు
A2 న్యూస్, జూన్ 15, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)
ప్రజావాణి కార్యక్రమం ద్వారా ప్రజల నుండి అందుతున్న ఫిర్యాదులు, వినతుల పరిష్కారానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస్ రావు తెలిపారు. సోమవారం మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఎస్పీ డి.వి. శ్రీనివాస్ రావు ప్రజల నుండి వచ్చిన వినతులు, ఫిర్యాదులను స్వీకరించి వాటిపై సమగ్రంగా విచారణ జరిపారు. జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రజలు వ్యక్తిగత, సామాజిక, భూ వివాదాలు, మోసాలు, వేధింపులు తదితర సమస్యలకు సంబంధించిన అర్జీలను సమర్పించారు. ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించిన ఎస్పీ, బాధితులకు న్యాయం జరిగేలా చట్టపరమైన చర్యలు చేపట్టాలని సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు. ప్రజావాణి ద్వారా అందిన ఫిర్యాదుల పరిష్కారంలో ఎలాంటి జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని, ప్రతి వినతిదారునికి వారి ఫిర్యాదు పురోగతిపై ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని సూచించారు. ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించడం ద్వారా పోలీసు వ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని మరింత బలోపేతం చేయవచ్చని ఆయన పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందించడం, బాధితులకు త్వరితగతిన న్యాయం చేయడం, ప్రజా సమస్యల పరిష్కారానికి పారదర్శకమైన వ్యవస్థను అమలు చేయడం మెదక్ జిల్లా పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం నిర్భయంగా పోలీసులను సంప్రదించాలని ఆయన పిలుపునిచ్చారు.

