A2 న్యూస్ జూన్ 20, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)
తూప్రాన్ 19, తూప్రాన్లో అక్రమంగా జూదం నిర్వహిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు శుక్రవారం ఆకస్మిక దాడి నిర్వహించి ఎనిమిది మందిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.10,587 నగదు, 7 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం, తూప్రాన్లోని గీతా స్కూల్ వెంచర్ సమీపంలో కొందరు వ్యక్తులు అక్రమంగా జూదం నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో ప్రత్యేక బృందం దాడి చేపట్టింది. ఈ దాడిలో మల్లబోయిన గణేష్, ఇటుక్యాల రేవంత్ రెడ్డి, మస్కూరి రాజు, కుమ్మరి మొగిలి, చిరుమాని పరమేశ్, పైనం సాయి కుమార్, మంతూరి రాజశేఖర్, వెంచర్ల రాజులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి రూ.10,587 నగదు, 7 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అనంతరం వారిపై సంబంధిత చట్టాల ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా మెదక్ జిల్లా ఎస్పీ డి.వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ, జిల్లాలో జూదం, క్రికెట్ బెట్టింగ్, ఆన్లైన్ బెట్టింగ్ వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. ఇటువంటి అక్రమ కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా కొనసాగుతోందని, పాల్పడే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జూదం వ్యక్తులు, కుటుంబాలు, సమాజంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని పేర్కొన్న ఎస్పీ, తమ పరిసరాల్లో జూదం లేదా ఇతర అక్రమ కార్యకలాపాలు జరుగుతున్నట్లు తెలిసిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజల సహకారంతో జిల్లాలో నేరాల నియంత్రణను మరింత సమర్థవంతంగా అమలు చేస్తామని ఆయన తెలిపారు.

