ఆరు గ్రామాల ప్రజలకు అవకాశం.. జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్
A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) సెప్టెంబర్ 2:
మెదక్ జిల్లా (1) జిల్లాలో భూ రీసర్వే పూర్తయిన గ్రామాల్లో భూ సమస్యలు లేదా రీసర్వేపై అభ్యంతరాలు ఉన్న రైతులు, భూ యజమానులు స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో అప్పీల్ చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ సూచించారు. మంగళవారం మెదక్ తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో భూ రీసర్వే పూర్తయిన ఆరు గ్రామాల్లో భూ సమస్యలపై వచ్చిన అభ్యంతరాల పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ మాట్లాడుతూ.. 9(2) చట్టం ద్వారా భూ రీసర్వేపై అభ్యంతరాలు ఉన్న వారు అప్పీల్ చేసుకోవచ్చని తెలిపారు. తహసీల్దార్ కార్యాలయంలో డీటీ స్థాయి, డిప్యూటీ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులు అప్పీళ్లను పరిశీలించి సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటారని పేర్కొన్నారు. రీసర్వేకు సంబంధించిన అప్పీళ్ల కోసం తహసీల్దార్ కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అప్పీళ్ల స్వీకరణ, పరిష్కార ప్రక్రియను సక్రమంగా నిర్వహించాలని సూచించారు. ఈ సమావేశంలో ఆర్డీవో రమాదేవి, ఏడి ల్యాండ్ సర్వే కిషన్, తహసీల్దార్ లక్ష్మణ్ బాబు, రెవెన్యూ, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

