అర్హులను క్షుణ్ణంగా పరిశీలించి పక్కా ఇళ్లు మంజూరు చేయాలి
రెండో విడతలో గుడిసెల్లో నివసిస్తున్న నిరుపేదలకు తొలి ప్రాధాన్యత
– జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్
A2న్యూస్, జులై 9, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)
మెదక్ (8) ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా నిజమైన అర్హులైన నిరుపేదలకు పక్కా ఇళ్లు అందేలా అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆదేశించారు. బుధవారం జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో గృహ నిర్మాణ శాఖ పీడీ మాణిక్యంతో కలిసి రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియపై గూగుల్ మీట్ ద్వారా జిల్లా స్థాయి అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రెండో విడతలో గుడిసెల్లో నివసిస్తున్న నిరుపేద కుటుంబాలకు తొలి ప్రాధాన్యత కల్పించాలని స్పష్టం చేశారు. ఇందుకోసం జిల్లావ్యాప్తంగా 78 మంది మండల గెజిటెడ్ అధికారులను నియమించామని తెలిపారు. మొబైల్ యాప్ ద్వారా దారిద్య్రరేఖకు దిగువన ఉండి గుడిసెల్లో నివసిస్తున్న అర్హులను గుర్తించి వారికి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు చెప్పారు. ఎలాంటి అనర్హులు లబ్ధి పొందకుండా క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయి పరిశీలన నిర్వహించి, పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
జిల్లాకు మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పురోగతిని మండలాల వారీగా సమీక్షించిన కలెక్టర్, గ్రౌండింగ్, బేస్మెంట్, స్లాబ్, రూఫ్ తదితర దశల్లో ఉన్న నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. క్షేత్రస్థాయిలో అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేపట్టి నిర్మాణ పనులు వేగంగా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ ఫ్లాగ్షిప్ కార్యక్రమమైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో మరింత పురోగతి సాధించేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి నిర్దేశించిన లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. నిజమైన పేదలందరికీ గౌరవప్రదమైన నివాసం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆమె పేర్కొన్నారు. ఈ సమావేశంలో గృహ నిర్మాణ శాఖ పీడీ మాణిక్యం, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, మండల గెజిటెడ్ అధికారులు, డీఈలు, ఏఈలు తదితరులు పాల్గొన్నారు.

