దర్యాప్తు, ప్రాసిక్యూషన్లో కృషి చేసిన పోలీసు సిబ్బందిని అభినందించిన ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు
A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) ఆగస్టు 1:
మెదక్ జిల్లా (31)వృద్ధురాలి హత్య కేసులో నిందితులైన దంపతులు బి. కీరాజీ (36), జక్కుల చంద్రకళ (34)లకు మెదక్ జిల్లా ప్రధాన న్యాయస్థానం జీవిత ఖైదుతో పాటు ఒక్కొక్కరికి 7వేల చొప్పున జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించినట్లు జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు తెలిపారు. ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. సహజీవనం చేస్తున్న కీరాజీ, చంద్రకళ ఆర్థిక ఇబ్బందుల కారణంగా చంద్రకళ తల్లి రాధ వద్ద ఉన్న నగదును దోచుకోవాలనే ఉద్దేశంతో ఆమె హత్యకు పథకం రచించారు. 2020 అక్టోబర్ 11న రాధకు మద్యం తాగించి, కీరాజీ నడుపుతున్న ఆటోలో తీసుకెళ్లారు. కీరాజీకి పరిచయమున్న లక్కీ, సలీంలను కూడా వెంట తీసుకుని ఉప్పుగూడ నుంచి బోయిన్పల్లి మీదుగా మనోహరాబాద్ వైపు వెళ్లి, జాతీయ రహదారి సమీపంలోని నిర్మానుష్య ప్రాంతంలో రాధను హత్య చేసినట్లు దర్యాప్తులో తేలింది. హత్య అనంతరం నిందితులు హైదరాబాద్లోని ఉప్పుగూడలో ఉన్న రాధ ఇంటికి వెళ్లి ఆమె దాచిన 4 లక్షల నగదును తీసుకెళ్లినట్లు ఎస్పీ తెలిపారు. అందులో రూ.50 వేలును లక్కీ, సలీంలకు ఇచ్చినట్లు విచారణలో వెల్లడైందన్నారు. హత్యకు ఉపయోగించిన కత్తిని ఇంట్లో దాచడంతో పాటు, దోచుకున్న నగదులో కొంత మొత్తంతో బంగారం, వెండి వస్తువులు కొనుగోలు చేసి గుజరాత్కు వెళ్లినట్లు గుర్తించామని చెప్పారు. అనంతరం హైదరాబాద్కు తిరిగి వచ్చిన తర్వాత నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు వివరించారు. ఈ కేసులో మనోహరాబాద్ పోలీసులు కేసు నమోదు చేయగా, అప్పటి దర్యాప్తు అధికారులు స్వామిగౌడ్, శ్రీధర్ సమగ్ర దర్యాప్తు నిర్వహించి ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ప్రాసిక్యూషన్ తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ టి. వెంకటేశ్ సమర్థవంతంగా వాదనలు వినిపించారు. దర్యాప్తులో సేకరించిన సాక్ష్యాధారాలను పరిశీలించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. నీలిమ నిందితులిద్దరికీ జీవిత ఖైదుతో పాటు ఒక్కొక్కరికి 7 వేల చొప్పున జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. ఈ కేసు దర్యాప్తు, ప్రాసిక్యూషన్ సమన్వయంలో విశేష కృషి చేసిన జిల్లా లైజనింగ్ ఆఫీసర్ ఎస్ఐ బి. విఠల్, కోర్టు లైజనింగ్ పీసీ జి. రవీందర్గౌడ్, సీడీఓ మహిపాల్రెడ్డితో పాటు సంబంధిత పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు అభినందించారు.

