విద్యార్థులకు పాఠాలు బోధించి సామర్థ్యాలు పరిశీలించిన కలెక్టర్
అన్ని కేజీబీవీల్లో కిచెన్ గార్డెన్లు ఏర్పాటు చేయాలి
భోజనం–చదువు–క్రీడలు ప్రతి విద్యార్థి దినచర్యలో భాగం కావాలి
A2న్యూస్, జూలై 26, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)
చేగుంట (25) విద్యార్థి దశ నుంచే క్రమశిక్షణను అలవాటు చేసుకుంటేనే భవిష్యత్తు బంగారుమయం అవుతుందని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ పేర్కొన్నారు. శనివారం చేగుంట మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)ను ఆమె సందర్శించి విద్యార్థులతో మమేకమయ్యారు. ముందుగా 6, 7వ తరగతి విద్యార్థుల అభ్యాస సామర్థ్యాలను స్వయంగా పరిశీలించారు. విద్యార్థులతో టేబుల్స్ చెప్పించి వారి ప్రతిభను పరీక్షించారు. అనంతరం 10వ తరగతి విద్యార్థులకు జరుగుతున్న అన్ అకాడమీ తరగతులను పరిశీలించి, ఫాస్ట్ మ్యాథ్స్, గెట్ ఇట్ రైట్ పుస్తకాల ప్రాధాన్యతను వివరించారు. ప్రతి పోటీ పరీక్షలో గణితం కీలకమని, ఫాస్ట్ మ్యాథ్స్ పుస్తకంలోని అంశాలను సాధన చేస్తే గణితంపై మంచి పట్టు సాధించవచ్చని సూచించారు. కొన్ని కంప్యూటర్లు మరమ్మతులకు గురైనట్లు గుర్తించిన కలెక్టర్ వాటిని వెంటనే బాగు చేసి విద్యార్థులందరికీ అన్ అకాడమీ తరగతులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం వంటగదిని సందర్శించి ఆహార పదార్థాలు, వంట సామగ్రి, విద్యార్థులకు సిద్ధం చేసిన భోజనాన్ని పరిశీలించారు. డైట్ చార్ట్ ప్రకారమే వంటలు చేస్తున్నారా? ఎంత మంది విద్యార్థులు భోజనం చేస్తున్నారు? అనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. కేజీబీవీ ఆవరణ పరిశుభ్రంగా ఉండాలని, ఎలాంటి చెత్తాచెదారం లేకుండా పారిశుద్ధ్యాన్ని కచ్చితంగా పాటించాలని ఆదేశించారు. జిల్లాలోని అన్ని కేజీబీవీల్లో కిచెన్ గార్డెన్లు ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టాలని సూచించారు.
ప్రతి విద్యార్థి దినచర్యలో భోజనం, చదువు, క్రీడలు తప్పనిసరిగా ఉండాలని, నిరంతర సాధన ద్వారానే మంచి భవిష్యత్తు సాధ్యమవుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. యూట్యూబ్ వీడియోల కంటే అన్ అకాడమీ తరగతులు విద్యార్థులకు మరింత ఉపయోగకరంగా ఉంటాయని చెప్పారు. ఉపాధ్యాయులు ప్రణాళికాబద్ధంగా బోధన కొనసాగించాలని, విద్యార్థుల సమస్యలను ఎప్పటికప్పుడు అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ ఎల్లయ్య, జిల్లా విద్యాశాఖ అధికారి రాజు, బీడబ్ల్యూఓ హేమాభార్గవి, ఎంపీడీవో చెన్నారెడ్డి, గణాంక అధికారి నవీన్, కేజీబీవీ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

