ప్రశాంతంగా, పారదర్శకంగా ఎన్నికలు
A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)ఆగస్టు 25 :
మెదక్ (24) జిల్లా పోలీస్ అధికారుల సంఘం నూతన కార్యవర్గ ఎన్నికలు జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగాయి. జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు ఆదేశాల మేరకు ఎన్నికల అధికారి అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, ఆధ్వర్యంలో ఈ నెల 20న ఎన్నికల ప్రక్రియ నిర్వహించారు. ఎన్నికల నోడల్ అధికారి అదనపు ఎస్పీతో పాటు ఎన్నికల నిర్వహణ కమిటీ సభ్యులు ఎస్బీ ఇన్స్పెక్టర్ సందీప్ రెడ్డి, రామకృష్ణ పర్యవేక్షణలో ఎన్నికలు సజావుగా కొనసాగాయి. ఎన్నికల ఏర్పాట్లను ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు స్వయంగా పరిశీలించి, ఎన్నికలను పూర్తి పారదర్శకతతో నిర్వహించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు. జిల్లా పరిధిలోని వివిధ హోదాల్లో పనిచేస్తున్న పోలీస్ అధికారులు, సిబ్బంది ఉత్సాహంగా ఎన్నికల్లో పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల అనంతరం నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. జిల్లా పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడిగా అభిలాష్ ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా ఎస్బీ ఇన్స్పెక్టర్ సందీప్ రెడ్డి, ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ ఎన్నికయ్యారు. ఆర్ఎస్ఐ నరేష్ కార్యదర్శిగా, విజయ్ కోశాధికారిగా, రాము సంయుక్త కార్యదర్శిగా ఎన్నికయ్యారు.
అదేవిధంగా సంఘం ఎక్స్అఫిషియో సభ్యులుగా సాజిద్ అలీ, సతీష్, విజయ్ కుమార్, గంగామణి, నర్సింలు, రేణుక ఎన్నికయ్యారు. గోపాల్, భాగ్యలక్ష్మి కోఆప్షన్ సభ్యులుగా ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులను జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు, అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ తో పాటు ఇతర పోలీస్ ఉన్నతాధికారులు అభినందించారు. పోలీస్ అధికారుల సంక్షేమం, వారి సమస్యల పరిష్కారానికి నూతన కార్యవర్గం సమర్థవంతంగా పనిచేయాలని ఆకాంక్షించారు.

