పరాగ సంపర్కంతో గెలల ఏర్పాటు మెరుగై దిగుబడి పెరుగుతుందని ఉద్యాన శాఖ అధికారి ప్రతాప్ సింగ్ వెల్లడి
A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) ఆగస్టు 12:
హవేలీఘనపూర్ (11) మెదక్ జిల్లా హవేలీఘనపూర్ మండలంలోని ప్రభు వరగౌడ్కు చెందిన ఆయిల్పామ్ తోటల్లో పరాగ సంపర్కం కోసం ఉద్యాన శాఖ అధికారుల ఆధ్వర్యంలో ఎలిడోబియస్ కెమెరోనికస్ (వీవిల్)ను విడుదల చేశారు. వీవిల్ ద్వారా పరాగ సంపర్కం సమర్థవంతంగా జరిగి, గెలల ఏర్పాటు మెరుగుపడి ఆయిల్పామ్ దిగుబడి పెరిగే అవకాశం ఉందని జిల్లా ఉద్యాన శాఖ అధికారి జె. ప్రతాప్ సింగ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయిల్పామ్ రైతులు ప్రభుత్వ మార్గదర్శకాలను పాటిస్తూ సరైన సమయంలో వీవిల్ను తోటల్లో విడుదల చేయడం ద్వారా అధిక దిగుబడులు సాధించవచ్చన్నారు. రైతులు తమ తోటల నిర్వహణకు సంబంధించి ఎప్పటికప్పుడు ఉద్యాన శాఖ అధికారులను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హవేలీఘనపూర్ వ్యవసాయ అధికారి బాల్ రెడ్డి, ఉద్యాన అధికారి రచన, లీవ్ పామ్ కంపెనీ మేనేజర్ కృష్ణ, కంపెనీ ప్రతినిధులు, వ్యవసాయ విస్తరణ అధికారిణి తేజస్విని, రైతులు పాల్గొన్నారు.

