A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) ఆగస్టు 18:
మెదక్ జిల్లా (17) చారిత్రక మెదక్ ఖిల్లాపై ప్రత్యేక పోస్టల్ కవర్, స్టాంప్ను రాష్ట్ర మంత్రి, మెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మెదక్ ఖిల్లాకు ఎంతో చారిత్రక ప్రాధాన్యత ఉందని, ఖిల్లాను ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. స్వదేశీ దర్శన్ ప్రాజెక్ట్ కింద ఖిల్లా అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని, కేంద్ర నిధులు తీసుకురావడానికి ఎంపీ రఘునందన్ రావు కృషి చేయాలని సూచించారు. మెదక్ చర్చి అభివృద్ధికి ప్రభుత్వం రూ.30 కోట్లు కేటాయించిందని, జిల్లాలోని చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాంతాలను అభివృద్ధి చేసి పర్యాటకంగా మరింత గుర్తింపు తీసుకువస్తామని చెప్పారు. ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ మెదక్ ఖిల్లా ప్రాచుర్యాన్ని గుర్తించి పోస్టల్ స్టాంప్, కవర్ విడుదల చేయడం అభినందనీయమన్నారు. స్వదేశీ దర్శన్ కార్యక్రమంలో భాగంగా పురాతన కోటల పరిరక్షణకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం శుభ పరిణామమని పేర్కొన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ ప్రతిమా సింగ్, ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, అధికారులు, ప్రజాప్రతినిధులు, పోస్టల్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

