బారికేడింగ్, లైటింగ్పై ప్రత్యేక దృష్టి పెట్టాలి
గజ ఈతగాళ్లు, మత్స్యకారులను షిఫ్టుల వారీగా అందుబాటులో ఉంచాలి
శాఖల మధ్య సమన్వయంతో నిమజ్జన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి
A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) సెప్టెంబర్ 17:
మెదక్ జిల్లా (16) వినాయక విగ్రహాల నిమజ్జన కార్యక్రమాలను ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలని మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు అధికారులను ఆదేశించారు. కొంటూరు చెరువు వద్ద చేపట్టిన వినాయక నిమజ్జన ఏర్పాట్లను జిల్లా ఎస్పీ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా నిమజ్జనానికి వచ్చే భక్తులు, వాహనాలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. వాహనాల రాకపోకలకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించాలని, రాత్రివేళల్లో భక్తులకు ఇబ్బందులు లేకుండా తగినంత లైటింగ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. చిన్న విగ్రహాలు, భారీ విగ్రహాలతో వచ్చే వాహనాలకు ప్రత్యేక మార్గాలు ఏర్పాటు చేసి, అవసరమైన ప్రాంతాల్లో బారికేడింగ్ చేపట్టాలని సూచించారు. ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకోవడంతో పాటు, నిమజ్జన ప్రాంతంలోకి అనవసర వాహనాలను అనుమతించకుండా ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని పోలీసు అధికారులను ఆదేశించారు. నిమజ్జన సమయంలో ఎలాంటి అత్యవసర పరిస్థితి తలెత్తినా వెంటనే స్పందించేలా జేసీబీలు, క్రేన్లు, అగ్నిమాపక వాహనాలు, అత్యవసర సేవలు, ప్రథమ చికిత్స కేంద్రాలు, వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచాలని ఎస్పీ తెలిపారు. మత్స్యకారులు, గజ ఈతగాళ్లను షిఫ్టుల వారీగా విధుల్లో ఉంచి, నిమజ్జన ప్రాంతంలో భద్రతా చర్యలను నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. అలాగే విద్యుత్ ప్రమాదాలకు తావులేకుండా ముందస్తు తనిఖీలు చేపట్టాలని, నిమజ్జన ఏర్పాట్లకు వినియోగించే వాహనాలు, యంత్రాల వినియోగానికి సంబంధించిన డ్యూటీ వివరాలు, సిబ్బంది సంతకాలు, రోజువారీ రికార్డులను తప్పనిసరిగా నిర్వహించాలని ఎస్పీ సూచించారు. సంబంధిత శాఖల అధికారులు, పోలీసు సిబ్బంది పరస్పర సమన్వయంతో పనిచేస్తూ ప్రతి అంశాన్ని ముందుగానే పర్యవేక్షించాలని ఆయన పేర్కొన్నారు. నిమజ్జన కార్యక్రమాన్ని సురక్షితంగా, ప్రశాంతంగా, విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ ప్రసన్న కుమార్, మున్సిపల్ చైర్మన్ రాధిక భూపతి, వైస్ చైర్మన్ నరేష్, సీఐలు సందీప్ రెడ్డి, కృష్ణమూర్తి, వివిధ శాఖల అధికారులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

