మద్యం విక్రయ కేంద్రాల పరిసరాల్లో ఆరోగ్యకర వాతావరణం కల్పించాలి – టాస్క్ ఫోర్స్ బృందాలతో విస్తృత తనిఖీలకు ఆదేశం
A2న్యూస్ ,జులై 8, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)
మెదక్ జిల్లా (7) గంజాయి వంటి మాదకద్రవ్యాల నియంత్రణకు పటిష్టమైన నిఘా ఏర్పాటు చేసి, జిల్లాలో మత్తు పదార్థాలను పూర్తిగా నిర్మూలించే దిశగా తెలంగాణ ఎక్సైజ్ & ప్రొహిబిషన్ శాఖ కట్టుదిట్టంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ ఛాంబర్లో ఎక్సైజ్ శాఖ పనితీరుపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాలో గంజాయి, ఇతర మత్తు పదార్థాల అక్రమ రవాణా, విక్రయాలను అరికట్టేందుకు టాస్క్ ఫోర్స్ బృందాలతో విస్తృత స్థాయిలో తనిఖీలు నిర్వహించాలని సూచించారు. అలాగే మద్యం విక్రయ కేంద్రాల పరిసరాల్లో ఆరోగ్యకరమైన వాతావరణం ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మత్తు పదార్థాల వల్ల కలిగే దుష్పరిణామాలపై విద్యార్థుల్లో అవగాహన పెంచేందుకు పాఠశాలలు, కళాశాలల్లో ప్రత్యేక అవగాహన సదస్సులు నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. ఈ సందర్భంగా జిల్లా ఎక్సైజ్ అధికారి నర్సింహారెడ్డి మాట్లాడుతూ, మెదక్ జిల్లాలో మొత్తం 49 మద్యం దుకాణాలు, 5 బార్లు ఉన్నాయని తెలిపారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో రూ.574.08 కోట్ల ఆదాయం లభించగా, ప్రస్తుత సంవత్సరంలో ఇప్పటివరకు రూ.410.44 కోట్ల ఆదాయం సమకూరిందన్నారు.
జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మత్తు పదార్థాల నియంత్రణపై మరింత కఠినంగా వ్యవహరిస్తామని, పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. సమావేశంలో ఎక్సైజ్ అధికారులు నాగేశ్వరరావు, నరేందర్, సలాం ముస్తఫా, మాన్ సింగ్, రాజేష్, రామచందర్, ఖాజా ఆహమ్మద్, అరుణ, విజయ్ సిద్ధార్థ, హరీష్ తదితరులు పాల్గొన్నారు.

