A2న్యూస్, జులై 8, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)
మెదక్ జిల్లా (7) కళాశాలలు, హాస్టళ్లు ప్రారంభమైన నేపథ్యంలో నూతనంగా చేరిన విద్యార్థుల పట్ల సీనియర్ విద్యార్థులు స్నేహపూర్వకంగా, గౌరవప్రదంగా వ్యవహరించాలని మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు సూచించారు. ర్యాగింగ్ అనేది చట్టరీత్యా శిక్షార్హమైన నేరమని పేర్కొన్న ఆయన, విద్యాసంస్థల్లో ర్యాగింగ్కు ఏమాత్రం అవకాశం లేకుండా యాజమాన్యాలు, అధ్యాపకులు, విద్యార్థులు సమిష్టిగా కృషి చేయాలని కోరారు. నూతన విద్యార్థులను భయభ్రాంతులకు గురిచేయడం, అవమానించడం, శారీరక లేదా మానసిక వేధింపులకు పాల్పడడం వంటి చర్యలు కఠిన చట్టపరమైన చర్యలకు దారితీస్తాయని హెచ్చరించారు. విద్యాసంస్థల యాజమాన్యాలు యాంటీ ర్యాగింగ్ కమిటీలను సమర్థవంతంగా ఏర్పాటు చేసి, వాటి పనితీరును నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. హాస్టళ్లలో వార్డెన్లు ప్రత్యేక నిఘా ఉంచి విద్యార్థులకు సురక్షితమైన, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు ర్యాగింగ్ దుష్పరిణామాలపై అవగాహన కల్పించాలని, ఎలాంటి వేధింపులు ఎదురైనా వెంటనే కళాశాల యాజమాన్యానికి లేదా పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. మెదక్ జిల్లా పోలీసు శాఖ విద్యాసంస్థల పరిసరాల్లో ప్రత్యేక నిఘా కొనసాగిస్తోందని, ర్యాగింగ్కు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ స్పష్టం చేశారు. విద్యార్థులు ఎలాంటి సమస్య ఎదురైనా నిర్భయంగా పోలీసులను సంప్రదించాలని, వారి భద్రతకు జిల్లా పోలీసు శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు.

