Thursday, July 30, 2026
Homeమెదక్రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలి

రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలి

📰 Generate e-Paper Clip

సైబర్ మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించాలి – పెండింగ్ కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలి: జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు

A2న్యూస్, జూలై 22, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

నర్సాపూర్ (21) నర్సాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించి సమర్థవంతమైన చర్యలు చేపట్టాలని మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు పోలీసు అధికారులను ఆదేశించారు. మంగళవారం వార్షిక తనిఖీల్లో భాగంగా నర్సాపూర్ పోలీస్‌స్టేషన్‌ను ఆయన తనిఖీ చేశారు. ముందుగా పోలీసు సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించిన ఎస్పీ, పోలీస్‌స్టేషన్ ఆవరణలో మొక్కను నాటారు. అనంతరం స్టేషన్ పరిసరాలను పరిశీలించి, ఎఫ్‌ఐఆర్ రిజిస్టర్లు, క్రైమ్ రికార్డులు, కేసు డైరీలు, పెండింగ్ కేసులు, దర్యాప్తు పురోగతి తదితర రికార్డులను తనిఖీ చేశారు. పెండింగ్‌లో ఉన్న కేసుల దర్యాప్తును వేగవంతం చేసి, చట్టపరమైన నిబంధనల ప్రకారం త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు సూచించారు. పోలీస్‌స్టేషన్ పరిధిలో తరచూ ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్లను గుర్తించి, సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుని ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం, హెల్మెట్, సీట్‌బెల్ట్ వినియోగించకపోవడం వంటి కారణాలతో జరుగుతున్న ప్రమాదాలను అరికట్టేందుకు ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని సూచించారు. అలాగే రాత్రి గస్తీ, పెట్రోలింగ్‌ను మరింత ముమ్మరం చేసి నేరస్తుల కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలని తెలిపారు. విలేజ్ పోలీస్ ఆఫీసర్లు (వీపీఓలు) తమ గ్రామాల్లో సైబర్ నేరాలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని ఎస్పీ సూచించారు. ఆన్‌లైన్ మోసాలు, ఓటీపీ మోసాలు, బ్యాంకింగ్ మోసాలు, ఫేక్ లింకుల ద్వారా జరిగే మోసాల పట్ల ప్రజలను అప్రమత్తం చేయాలని, సైబర్ మోసానికి గురైన వెంటనే 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌కు సమాచారం అందించాలని తెలిపారు. పోలీస్‌స్టేషన్ పరిధిలో నేరాల నియంత్రణ, ప్రజల భద్రత కోసం సీసీ కెమెరాల ఏర్పాటు విస్తృతంగా చేపట్టాలని ఎస్పీ సూచించారు. దుకాణాలు, వ్యాపార సముదాయాలు, ప్రధాన కూడళ్లు, రద్దీ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా వ్యాపారులు, దుకాణ యజమానులకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. సీసీ కెమెరాల ద్వారా నేరాలను నియంత్రించడంతో పాటు నేరస్తులను గుర్తించడం, దర్యాప్తులో కీలక ఆధారాలను సేకరించడం సులభమవుతుందని తెలిపారు. ప్రజలు, వ్యాపారులు పోలీస్ శాఖకు సహకరించి సీసీ కెమెరాల ఏర్పాటుకు ముందుకు రావాలని ఎస్పీ కోరారు. ఈ తనిఖీ కార్యక్రమంలో తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్, సీఐలు రంగా కృష్ణ, సందీప్ రెడ్డి, ఎస్‌ఐలు రంజిత్ రెడ్డి, జగన్మోహన్, కృష్ణయ్యతో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install A2TV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!