A2న్యూస్, జూలై 18, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)
మెదక్ (17) జిల్లాలోని నూతన మండలాల్లో తహసీల్దార్ కార్యాలయాలు, సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల నూతన భవనాల నిర్మాణం కోసం అవసరమైన స్థలాల సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని తన ఛాంబర్ నుంచి నిర్వహించిన గూగుల్ మీట్ సమావేశంలో ఆమె అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, హవేలీ ఘనపూర్, నిజాంపేట, చిలిపిచేడు నూతన మండలాల్లో తహసీల్దార్ కార్యాలయాల నిర్మాణానికి అవసరమైన భూసేకరణను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. అలాగే మెదక్, నర్సాపూర్, రామాయంపేట డివిజన్ల పరిధిలో సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల నూతన భవనాల నిర్మాణానికి అవసరమైన స్థలాల గుర్తింపు, సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. స్థల సేకరణకు సంబంధించిన ఫైళ్లను త్వరగా సిద్ధం చేసి ఉన్నతాధికారులకు పంపించాలని అధికారులను నిర్దేశించారు. ఈ సమావేశంలో హౌసింగ్ పీడీ మాణిక్యం, ఆర్డీవోలు రమాదేవి, రామకృష్ణ బవయ్య, తహసీల్దార్లు, సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

