A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) ఆగస్టు 6:
మెదక్ జిల్లా ( 5) భూ భారతి చట్టంపై రెవెన్యూ సిబ్బంది పూర్తి అవగాహన కలిగి ఉండాలని డీఆర్వో అంబదాస్ రాజేశ్వర్ సూచించారు. బుధవారం కలెక్టరేట్లోని మీటింగ్ హాల్లో రెవెన్యూ సిబ్బందికి భూ భారతి చట్టంపై ఒక రోజు అవగాహన వర్క్షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఆర్వో అంబదాస్ రాజేశ్వర్ మాట్లాడుతూ, రెవెన్యూ శాఖలో పనిచేసే జూనియర్ అసిస్టెంట్లు తమ విధులను బాధ్యతాయుతంగా నిర్వహించాలని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం భూ రికార్డుల నిర్వహణను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా తీర్చిదిద్దేందుకు, గత వ్యవస్థలో ఉన్న లోపాలను సరిదిద్దేందుకు భూ భారతి చట్టాన్ని అమలు చేస్తోందని తెలిపారు. ఈ చట్టం ద్వారా భూ హక్కులకు రక్షణ కల్పించడంతో పాటు భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. ప్రజలకు చట్టంపై సరైన అవగాహన కల్పించడంలో రెవెన్యూ సిబ్బంది కీలక పాత్ర పోషించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

