A2న్యూస్, జులై 21, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)
మెదక్/సంగారెడ్డి (20) ఎల్నినో ప్రభావంతో ఈ ఏడాది వర్షపాతం తగ్గే అవకాశాల నేపథ్యంలో రైతులకు గ్రామగ్రామాన అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, ఆరుతడి మరియు ప్రత్యామ్నాయ పంటల సాగుపై విస్తృత ప్రచారం చేపట్టాలని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన, ఫ్యాక్టరీలు మరియు గనుల శాఖ మంత్రి, మెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి అధికారులను ఆదేశించారు. సంగారెడ్డి కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు సంబంధించిన ఎల్నినో ప్రభావ తీవ్రతను తగ్గించేందుకు రూపొందించిన ప్రత్యామ్నాయ కార్యాచరణ ప్రణాళికపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి టూరిజం శాఖ ప్రధాన కార్యదర్శి, మెదక్ జిల్లా ప్రత్యేక అధికారి వాణి ప్రసాద్, సంగారెడ్డి జిల్లా కలెక్టర్ పత్రిక్ జైన్, మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అంజిరెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు, సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమా హారతి, అదనపు ఎస్పీ చైతన్యతో పాటు ఇరిగేషన్, భూగర్భ జలాలు, విద్యుత్ శాఖలు మరియు వివిధ శాఖల జిల్లా అధికారులు హాజరయ్యారు.
రైతులకు సమగ్ర అవగాహన కల్పిస్తున్నాం: కలెక్టర్ ప్రతిమా సింగ్
మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ, ఎల్నినో ప్రభావం వల్ల ఈ ఏడాది వర్షపాతం తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందన్నారు. ఈ పరిస్థితుల్లో రైతులు అధిక నీటి అవసరం ఉన్న పంటలకు బదులుగా తక్కువ నీటితో సాగు చేయగల ప్రత్యామ్నాయ మెట్ట పంటలను ఎంచుకోవాలని సూచించారు. వ్యవసాయ, ఉద్యానవన శాఖల సమన్వయంతో రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. భూగర్భ జలాల పరిస్థితి, సాగునీటి లభ్యత, ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు, వర్షాభావ పరిస్థితులపై ప్రతి రైతుకు స్పష్టమైన సమాచారం అందిస్తున్నామని చెప్పారు.
రైతులకు నష్టపరిహారం అందించాలి: ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి
నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, ఎల్నినోపై రైతులకు మరింత విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. కోతుల బెడద అధికంగా ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక నివారణ చర్యలు చేపట్టాలని కోరారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.25 వేల నష్టపరిహారం అందించే అంశాన్ని రాష్ట్ర కేబినెట్లో చర్చించాలని ప్రభుత్వాన్ని కోరారు.
సింగూరు నీటి వినియోగంపై మంత్రి దృష్టికి ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి
నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి మాట్లాడుతూ, సింగూరు డ్యాం మరమ్మతుల కోసం నీటిని విడుదల చేసిన అనంతరం ప్రస్తుతం ఎనిమిది టీఎంసీల నీరు అందుబాటులో ఉందన్నారు. రైతుల సాగు అవసరాలు, తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. సమావేశంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

