‘పుట్టుక నీది.. చావు నీది.. బతుకంతా దేశానిది’ — ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు
A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి రాము సెప్టెంబర్ 10:
మెదక్ జిల్లా (9) ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతిని పురస్కరించుకుని మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయంలో బుధవారం ఘనంగా నివాళులర్పించారు. జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు, ఐపీఎస్ కాళోజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాళోజీ సాహిత్య, సామాజిక సేవలను స్మరించుకున్నారు. ఎస్పీ మాట్లాడుతూ.. “పుట్టుక నీది.. చావు నీది.. బతుకంతా దేశానిది” అంటూ కాళోజీ తన కవిత్వం ద్వారా ప్రజల్లో దేశభక్తి, సామాజిక బాధ్యతను పెంపొందించారని అన్నారు. ప్రజల సమస్యలను నిర్భయంగా తన రచనల్లో ప్రతిబింబిస్తూ ప్రజాకవిగా ప్రత్యేక గుర్తింపు పొందారని తెలిపారు. తెలంగాణ ప్రజల హక్కులు, సామాజిక న్యాయం కోసం కాళోజీ చేసిన కృషి చిరస్మరణీయమన్నారు.
కాళోజీ నారాయణరావు 1914 సెప్టెంబరు 9న జన్మించారని, సాహిత్య రంగంలో ఆయన చేసిన విశేష సేవలకు పద్మవిభూషణ్, సాహిత్య అకాడమీ అవార్డు తదితర ప్రతిష్ఠాత్మక పురస్కారాలు లభించాయని ఎస్పీ తెలిపారు.
కాళోజీ జన్మదినాన్ని తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ భాషా దినోత్సవంగా నిర్వహిస్తోందన్నారు. కాళోజీ ఆశయాలు, ప్రజాసేవా స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శమని ఎస్పీ పేర్కొన్నారు. ఆయన రచనలు సమాజంలో చైతన్యం తీసుకురావడంలో ఎప్పటికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని అన్నారు. కార్యక్రమంలో సైబర్ క్రైమ్ డీఎస్పీ సుభాష్ చంద్రబోస్, సీఐలు జర్జ్, సందీప్రెడ్డి, ఆర్ఐ రామకృష్ణ, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

