– జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్
A2 న్యూస్, జూన్ 24, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)
మనోహరాబాద్ జూన్ 23: జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధి వేగవంతం కావడంతో పాటు కొత్త పరిశ్రమల స్థాపన ద్వారా ఉపాధి అవకాశాలు పెరగాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ పేర్కొన్నారు. మంగళవారం మనోహరాబాద్ మండలంలోని శాంత బయోటెక్ పరిశ్రమలో జిల్లా పారిశ్రామిక అభివృద్ధిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పరిశ్రమల స్థాపనకు అనుకూల వాతావరణం కల్పించి, పారిశ్రామిక వేత్తలకు అవసరమైన సహకారం అందించాలని అధికారులను ఆదేశించారు. పరిశ్రమల నిర్వహణలో ఎదురయ్యే సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడంతో పాటు, ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీలు మరియు ప్రోత్సాహక పథకాలు అర్హులైన లబ్ధిదారులకు చేరేలా చర్యలు చేపట్టాలని సూచించారు.
జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు రూపొందించిన నూతన యాప్పై పారిశ్రామిక వేత్తలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పారిశ్రామిక వేత్తలు ఉత్సాహంగా పాల్గొని తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. అనంతరం శాంత బయోటెక్ పరిశ్రమ ఆవరణలో కలెక్టర్ మొక్కలు నాటి, వాటికి నీరు పోశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ ప్రకాష్ రావు, ఐఎల్ఏ అధ్యక్షుడు సుబ్బారావు, కార్యదర్శి, అసోసియేషన్ సభ్యులు, వివిధ పారిశ్రామిక వేత్తలు పాల్గొన్నారు.

