A2 న్యూస్, జూన్ 25, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)
మెదక్ 24: జిల్లాలో విద్యా సౌకర్యాలను మరింత మెరుగుపర్చేందుకు అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. బుధవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా విద్యాశాఖ అధికారి రాజు, మండల విద్యాధికారులు, ప్రత్యేక అధికారులు, విద్యాశాఖ అధికారులతో గూగుల్ మీట్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల పెంపు, మౌలిక వసతుల అభివృద్ధి, విద్యార్థులకు మెరుగైన విద్యా అవకాశాల కల్పన కోసం ప్రత్యేక అధికారులను నియమించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు (కేజీబీవీలు), మోడల్ స్కూళ్లు, యూఆర్ఎస్ పాఠశాలల్లో పెండింగ్లో ఉన్న పనులు, మౌలిక వసతుల సమస్యలపై ప్రత్యేక అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. విద్యాసంస్థల్లో ఉన్న సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించడంతో పాటు జిల్లాలో నాణ్యమైన విద్య అందించేందుకు కృషి చేయాలని ఆదేశించారు. ప్రత్యేక అధికారులు సమర్పించే నివేదికల ఆధారంగా సమస్యలు ఉన్న ప్రభుత్వ విద్యాసంస్థలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కార చర్యలు చేపడతామని తెలిపారు. ఈ సమావేశంలో సంబంధిత శాఖల అధికారులు, విద్యాశాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

