A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) ఆగస్టు 18:
మెదక్ జిల్లా (17) నిరుద్యోగ యువతకు మెరుగైన ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా మెదక్ ఎంప్లాయ్మెంట్, స్కిల్స్ అండ్ ఇండస్ట్రీ కనెక్ట్ ఎం ఈ ఎస్ ఐ సి పోర్టల్ను జిల్లా ఇన్చార్జి మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ప్రారంభించారు. మనోహరాబాద్ మండలం ముప్పిరెడ్డిపల్లిలోని శాంతా బయోటిక్స్ పరిశ్రమలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నిరుద్యోగ యువత భవితకు భరోసా కల్పించేందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోందన్నారు. విద్యార్థులు, ఉద్యోగార్థులు, నైపుణ్య సంస్థలు, పరిశ్రమలను ఒకే వేదికపైకి తీసుకువచ్చే డిజిటల్ వేదికగా. ఎం ఈ ఎస్ ఐ సి పనిచేస్తుందన్నారు. జిల్లా కలెక్టరేట్ ఐటీ బృందం, ఐటీసీ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఈ పోర్టల్ రూపొందించడంతో తెలంగాణలో జిల్లా స్థాయిలో ఇలాంటి సమీకృత ఉపాధి–నైపుణ్య వేదికను ప్రారంభించిన తొలి జిల్లాల్లో మెదక్ నిలిచిందన్నారు. జిల్లాలోని ఐటీఐలు, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజినీరింగ్ కళాశాలల విద్యార్థులు పోర్టల్లో నమోదు చేసుకుని తమ నైపుణ్యాలకు అనుగుణంగా ఉద్యోగ అవకాశాలను పొందవచ్చన్నారు.
జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ.. జిల్లాలోని పరిశ్రమల్లో స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు. ఎం ఈ ఎస్ ఐ సి దోహదపడుతుందన్నారు. హైదరాబాద్ వంటి నగరాలకు వెళ్లకుండా జిల్లాలోనే నైపుణ్యాలకు తగిన ఉద్యోగాలను పొందేలా పోర్టల్ను వినియోగించుకోవాలని సూచించారు. జిల్లాలోని పరిశ్రమలకు లాగిన్ సదుపాయం కల్పిస్తున్నామని, నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో తూప్రాన్ ఆర్డీవో బావయ్య, ఆలా చైర్పర్సన్ సుబ్బారావు, ఐటీసీ ప్రతినిధి ఆనంద్, ఈడీఎం సందీప్, సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు.

