ఓటరు జాబితాను తప్పులులేనిదిగా రూపొందిద్దాం: జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్
A2 న్యూస్, జూన్ 23, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)
మెదక్ :(22) జిల్లాలో అర్హులైన ప్రతి పౌరుడు ప్రత్యేక సమగ్ర సవరణ (సార్) కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని, ఓటరు జాబితాలో తమ పేర్లు, వివరాలను తప్పనిసరిగా సరిచూసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ పిలుపునిచ్చారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంపై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. తప్పులు లేని, పారదర్శకమైన ఓటరు జాబితా రూపొందించేందుకు అన్ని రాజకీయ పార్టీలు, ప్రజలు సహకరించాలని సూచించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రత్యేక సమగ్ర సవరణ (సార్) కార్యక్రమం జూన్ 25 నుంచి జూలై 24 వరకు నిర్వహించబడుతుందని తెలిపారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు ప్రతి పోలింగ్ కేంద్రానికి ఒక బూత్ స్థాయి ప్రతినిధిని (బి ఎల్ ఏ) నియమించి సంబంధిత వివరాలను అందించాలని కోరారు. బూత్ స్థాయి అధికారులు (బి ఎల్ ఓ) లు ఇంటింటికి వెళ్లి సర్వే నిర్వహిస్తారని, అర్హులైన ప్రతి పౌరుడు అవసరమైన సమాచారం, పత్రాలను అందించి సహకరించాలని సూచించారు. ఓటరు జాబితాలో పేరు నమోదు, తొలగింపు, సవరణ వంటి సేవలను ఆన్లైన్లో కూడా పొందవచ్చని తెలిపారు. ఓటర్లు తమ వివరాలను ఓటర్ల సేవల పోర్టల్ ద్వారా, అలాగే ఓటు హెల్ప్ లైన్ యాప్ ద్వారా పరిశీలించి అవసరమైన దరఖాస్తులను సమర్పించుకోవచ్చని కలెక్టర్ పేర్కొన్నారు.

