జిల్లాలో 2,403 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉంది
జిల్లా వ్యవసాయ అధికారి దేవ్ కుమార్
A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) ఆగస్టు 15:
మెదక్ జిల్లా (14) జిల్లాలో రైతుల అవసరాలకు సరిపడా యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని జిల్లా వ్యవసాయ అధికారి దేవ్ కుమార్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో ప్రస్తుతం మొత్తం 2,403 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వ ఉందని తెలిపారు. ఇందులో మార్క్ఫెడ్ వద్ద 1,855 మెట్రిక్ టన్నులు, రిటైలర్ల వద్ద 548 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉన్నాయని వివరించారు. ఆగస్టు 7, 2026 నుంచి రైతులు FSS యాప్ ద్వారా యూరియాను బుక్ చేసుకుని కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. రైతులు యాప్ ద్వారా తమకు అవసరమైన మొత్తం యూరియా పరిమాణానికి సంబంధించి బుకింగ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. ప్రతిరోజూ యూరియా స్టాక్ను అందుబాటులో ఉంచుతున్నామని స్పష్టం చేశారు. రిటైలర్ కేంద్రాల వద్ద పనిచేస్తున్న వాలంటీర్లు, రైతు వేదికల వద్ద ఉన్న ఏఈఓలు రైతులకు ఎఫ్ ఎస్ ఎస్ ద్వారా యూరియా బుకింగ్ చేసే విధానంపై అవగాహన కల్పిస్తున్నారని దేవ్ కుమార్ తెలిపారు. ఎఫ్ ఎస్ ఎస్ యాప్ వినియోగంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు బుకింగ్ ప్రక్రియలో సహాయం అందిస్తూ, వారి సమస్యలను పరిష్కరిస్తున్నామని చెప్పారు. రైతులు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని, అందుబాటులో ఉన్న యూరియాను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి సూచించారు.

