13 మంది అరెస్ట్.. ఆరుగురు పరారీ
14 మొబైల్ ఫోన్లు, రూ.55,375 నగదు స్వాధీనం
A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) ఆగస్టు 15:
అల్లాదుర్గ్ (14) అల్లాదుర్గ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కె.ఎన్.ఆర్. క్రషర్ వెనుక బొమ్మ బొరుసు ఆడుతున్న స్థావరంపై మెదక్ జిల్లా టాస్క్ఫోర్స్ పోలీసులు దాడి నిర్వహించారు. విశ్వసనీయ సమాచారం మేరకు నిఘా ఏర్పాటు చేసిన పోలీసులు.. జూదం ఆడుతున్న స్థావరంపై ఆకస్మికంగా దాడి చేశారు. ఈ దాడిలో బొమ్మ బొరుసు ఆడుతున్న 13 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులను గమనించిన మరో ఆరుగురు అక్కడి నుంచి పరారయ్యారు. పట్టుబడిన వారి వద్ద నుంచి 14 మొబైల్ ఫోన్లు, రూ.55,375 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిపై చట్టప్రకారం కేసులు నమోదు చేసి తదుపరి చర్యలు చేపడుతున్నట్లు మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు తెలిపారు. జిల్లాలో ఎక్కడైనా బొమ్మ బొరుసు, జూదం తదితర చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడినా, వాటిని నిర్వహించినా కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. చట్టవిరుద్ధ కార్యకలాపాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అలాంటి కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఆయన కోరారు.

