మెదక్లో బాంబ్, డాగ్ స్క్వాడ్లతో విస్తృత తనిఖీలు
A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) ఆగస్టు 15:
మెదక్ జిల్లా (14) స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నేపథ్యంలో మెదక్ జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు ఆదేశాల మేరకు శుక్రవారం మెదక్ పట్టణంలోని ప్రధాన ప్రాంతాల్లో బాంబ్, డాగ్ స్క్వాడ్లతో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. మెదక్ బస్టాండ్, రైల్వే స్టేషన్, సినిమా థియేటర్లు, కలెక్టరేట్, కోర్టు ప్రాంగణంతో పాటు ప్రజలు అధికంగా రాకపోకలు సాగించే ప్రాంతాలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు. బాంబ్ స్క్వాడ్ సిబ్బంది ప్రత్యేక పరికరాలతో అనుమానాస్పద వస్తువులు, బ్యాగులు, పరిసరాలను తనిఖీ చేశారు. శిక్షణ పొందిన స్నిఫర్ డాగ్ల సహాయంతో డాగ్ స్క్వాడ్ సిబ్బంది అనుమానాస్పద ప్రదేశాలను పరిశీలించారు.
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టిందని అధికారులు తెలిపారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వస్తువులు లేదా వ్యక్తులు కనిపించినట్లయితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. తనిఖీల్లో ఎస్సై విట్టల్, హెడ్ కానిస్టేబుళ్లు ఫస్సియొద్దీన్, రవీందర్, కానిస్టేబుళ్లు నర్సింలు, దుర్గ ప్రసాద్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

