పెన్షన్ల దరఖాస్తుల స్వీకరణ పారదర్శకంగా జరగాలి : కలెక్టర్ ప్రతిమా సింగ్
A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) ఆగస్టు 12:
మెదక్ జిల్లా (11) ప్రభుత్వం నూతనంగా అందించనున్న ఏడు రకాల చేయూత పెన్షన్లకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులను పారదర్శకంగా స్వీకరించి, త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని మినీ సమావేశ మందిరం నుంచి జిల్లా అధికారులు, ఎంపీడీవోలు, మండల ప్రత్యేక అధికారులతో కలెక్టర్ గూగుల్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం ఈ నెల 15వ తేదీ నుంచి నూతనంగా అందించనున్న చేయూత పెన్షన్ల కోసం వచ్చే దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి, అర్హులను గుర్తించాలని సూచించారు. ప్రజాప్రతినిధుల ద్వారా, ప్రజావాణి కార్యక్రమంలో పెన్షన్ల కోసం వచ్చిన దరఖాస్తులను ఎలాంటి జాప్యం లేకుండా వెంటనే డేటా ఎంట్రీ చేయాలని ఆదేశించారు. స్వీకరించిన దరఖాస్తుల డేటా ఎంట్రీ ప్రక్రియను అధికారుల సమన్వయంతో, పటిష్ట పర్యవేక్షణలో నిర్వహించాలని స్పష్టం చేశారు.
హెల్ప్డెస్క్ల ఏర్పాటు
చేయూత పెన్షన్ల దరఖాస్తుల కోసం ప్రత్యేకంగా హెల్ప్డెస్క్ నంబర్ ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ప్రతి ఎంపీడీవో కార్యాలయం, మున్సిపల్ కార్యాలయాల వద్ద ప్రజలకు అవగాహన కల్పించేలా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని సూచించారు.
వృద్ధాప్య, బీడీ కార్మికుల పెన్షన్లను మినహాయించి మిగిలిన పెన్షన్ల దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. వృద్ధాప్య, బీడీ కార్మికుల పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చిన అనంతరం వాటిని పరిష్కరించాలని సూచించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తూ అర్హులైన ప్రతి ఒక్కరికీ చేయూత పెన్షన్లు అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శ్రీనివాసరావు, జడ్పీ సీఈఓ ఎల్లయ్య, జిల్లా అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, మండల ప్రత్యేక అధికారులు, ఏపీవోలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

