ప్రజల ప్రాణ భద్రతే ప్రధాన లక్ష్యం – జాతీయ రహదారులపై ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు
A2న్యూస్, జూలై 23, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)
మెదక్,(22) మెదక్ జిల్లాను జీరో యాక్సిడెంట్ జోన్గా తీర్చిదిద్దేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆదేశించారు. జాతీయ రహదారులపై ప్రమాదాల నివారణ, రోడ్డు భద్రతా ప్రమాణాల మెరుగుదల, ప్రజల ప్రాణ రక్షణే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆమె స్పష్టం చేశారు. బుధవారం జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు, అదనపు కలెక్టర్ నగేష్, ఆర్&బీ ఇన్చార్జి ఈఈ శంకర్, పోలీసు, ఆర్&బీ, నేషనల్ హైవేస్ శాఖల అధికారులతో కలిసి రహదారి భద్రతపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో తరచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని శాశ్వత నివారణ చర్యలను వేగవంతం చేయాలని సూచించారు. జాతీయ రహదారులపై నిబంధనలకు విరుద్ధంగా వాహనాల పార్కింగ్, అక్రమ నిర్మాణాలు, ఫ్లెక్సీల ఏర్పాటుపై కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే నోటీసులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. నేషనల్ హైవేల వెంట పెట్రోల్ బంకులు, వాణిజ్య సంస్థలకు అనుమతులు జారీ చేసే సమయంలో నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. అలాగే రహదారి భద్రత పర్యవేక్షణ కోసం నేషనల్ హైవే టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే బ్లాక్ స్పాట్స్ గుర్తించి, అక్కడ సీసీ కెమెరాలు, మెరుగైన లైటింగ్, బారికేడ్లు, రేడియం స్టిక్కర్లు, స్పీడ్ కంట్రోల్ చర్యలు చేపట్టాలని సూచించారు. పాదచారుల భద్రత కోసం ఫుట్ ఓవర్ బ్రిడ్జిల వద్ద భద్రతా ప్రమాణాలను మరింత బలోపేతం చేయాలని ఆదేశించారు. వడియారం ప్రాంతంతో పాటు రామాయంపేట జంక్షన్లో రహదారి భద్రతకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించి, ప్రయాణికులు సురక్షితంగా, సాఫీగా ప్రయాణించేలా చర్యలు చేపట్టాలని సంబంధిత శాఖలను ఆదేశించారు. విద్యార్థుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్న కలెక్టర్, IRC (Indian Roads Congress) నిబంధనల ప్రకారం జిల్లాలోని అన్ని పాఠశాలల సమీపంలో వేగ నియంత్రికలు, ప్రమాద హెచ్చరిక బోర్డులు, అవసరమైన రహదారి భద్రతా ఏర్పాట్లు తప్పనిసరిగా ఉండేలా చూడాలని సూచించారు. వర్షాకాలంలో నీటి నిల్వ సమస్యలు, పాదచారుల భద్రత, రోడ్డు ప్రమాదాల నివారణ వంటి అంశాలపై అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.
జిల్లాలోని జాతీయ రహదారులపై నిర్వహించిన సంయుక్త తనిఖీల్లో రహదారి సూచికలు, పేవ్మెంట్ మార్కింగ్స్, డిలినేటర్లు, హజార్డ్ మార్కర్లు, మీడియన్ బ్యారియర్లు, డబుల్ ఆర్మ్ స్ట్రీట్ లైటింగ్, రోడ్ స్టడ్స్, రంబుల్ స్ట్రిప్స్ తదితర భద్రతా పనులు ఇప్పటికే పలు ప్రాంతాల్లో పురోగతిలో ఉన్నాయని అధికారులు సమావేశంలో వివరించారు. ఈ చర్యలతో ఎన్హెచ్–163 మార్గంలో ప్రయాణించే ప్రజలకు మరింత సురక్షితమైన ప్రయాణ వాతావరణం ఏర్పడుతుందని కలెక్టర్ తెలిపారు. రోడ్డు భద్రతకు అత్యున్నత ప్రాధాన్యత ఇస్తూ, ప్రజల ప్రాణ రక్షణే లక్ష్యంగా అన్ని శాఖల సమన్వయంతో అవసరమైన చర్యలను అమలు చేస్తున్నాం” అని కలెక్టర్ ప్రతిమా సింగ్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో నేషనల్ హైవే, ఆర్&బీ, పోలీసు శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

