బాలల హక్కులు, పోక్సో చట్టం, బాల్య వివాహాలు, ర్యాగింగ్పై అవగాహన
మైనర్ డ్రైవింగ్కు దూరంగా ఉండాలి: ఏ ఎం వి ఐ పొన్నం శ్రీనివాస్
A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) సెప్టెంబర్ 11:
మెదక్ జిల్లా (10) మంబోజిపల్లిలోని మహాత్మా జ్యోతిబా ఫూలే బాలుర పాఠశాలలో షీ టీం ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి AMVI ఏ ఎం వి ఐ పొన్నం శ్రీనివాస్ హాజరై విద్యార్థులకు రోడ్డు భద్రతా నిబంధనలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా షీ టీం బృందం విద్యార్థులకు బాలల హక్కులు, పోక్సో చట్టం, బాల్య వివాహాల నిరోధక చట్టం, ర్యాగింగ్ తదితర అంశాలపై వివరించారు. మహిళలు, బాలికలు ఎలాంటి వేధింపులకు గురైనా భయపడకుండా వెంటనే షీ టీంను సంప్రదించాలని సూచించారు. మహిళలు, బాలికల భద్రత కోసం షీ టీం అందిస్తున్న సేవలు, చేపడుతున్న చర్యలను వివరించారు. ఏ ఎం వి ఐ పొన్నం శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులు చిన్న వయస్సు నుంచే రోడ్డు భద్రతా నిబంధనలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. చట్టం నిర్దేశించిన వయస్సు పూర్తయిన తర్వాత మాత్రమే వాహనాలు నడపాలని తెలిపారు. మైనర్లు వాహనాలు నడపడం చట్టవిరుద్ధమని, తల్లిదండ్రులు పిల్లలకు వాహనాలు ఇవ్వకుండా బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, కారులో ప్రయాణించే వారు సీటు బెల్ట్ తప్పనిసరిగా ఉపయోగించాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, షీ టీం సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

