4.28 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ
1.01 లక్షల మంది రైతులకు రూ.1005.66 కోట్లు చెల్లింపు
జొన్నల కొనుగోళ్లు కొనసాగుతాయి.. రైతులు ఆందోళన చెందొద్దు : కలెక్టర్ ప్రతిమా సింగ్
A2న్యూస్, జులై 3, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)
మెదక్ (2) జిల్లా చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఈ యాసంగి సీజన్లో రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్లను సంపూర్ణంగా విజయవంతంగా పూర్తి చేశామని ఆమె వెల్లడించారు.గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, గత ఏడాదితో పోలిస్తే ఈసారి యాసంగి సీజన్లో రైతులు 1.08 లక్షల మెట్రిక్ టన్నుల అధిక దిగుబడి సాధించారని తెలిపారు. జిల్లాలో మొత్తం 4,28,361 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి రికార్డు సృష్టించామని చెప్పారు.ధాన్యం విక్రయించిన 1,01,752 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.1005.66 కోట్లు నేరుగా జమ చేసినట్లు తెలిపారు. ఏప్రిల్ 8న ప్రారంభమైన కొనుగోళ్లు జూన్ 27తో విజయవంతంగా ముగిశాయని పేర్కొన్నారు.జిల్లాలో మొత్తం 533 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వీటిలో 305 పీఏసీఎస్, 185 ఐకేపీ, 43 డీసీఎంఎస్ కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేసినట్లు వెల్లడించారు.
ధాన్యం కొనుగోళ్లను విజయవంతంగా పూర్తి చేయడంలో మీడియా పాత్ర ఎంతో కీలకమని కలెక్టర్ ప్రశంసించారు. మీడియా ఇచ్చిన సూచనలు, సలహాలను అమలు చేయడం వల్ల రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కొనుగోళ్లు నిర్వహించగలిగామని చెప్పారు.
జొన్న రైతులు ఆందోళన చెందొద్దు
జిల్లాలో జొన్న రైతులు ఎలాంటి ఆందోళనకు గురికావద్దని కలెక్టర్ ప్రతిమా సింగ్ సూచించారు. సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మవద్దని, ప్రభుత్వం నాణ్యమైన జొన్నలను కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉందన్నారు. ఇప్పటివరకు 3,609 మంది రైతుల నుంచి 6,347 మెట్రిక్ టన్నుల జొన్నలను కొనుగోలు చేసినట్లు తెలిపారు.సమావేశంలో అదనపు కలెక్టర్ నగేష్, జిల్లా సివిల్ సప్లై అధికారి పి. నిత్యానందం, సివిల్ సప్లై మేనేజర్ జగదీష్, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి శ్రీనివాసరావు, డీపీఆర్వో రామచంద్రరాజు, పాత్రికేయులు పాల్గొన్నారు.

