తెలంగాణ సాధన కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయం: మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు
A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) ఆగస్టు 7:
మెదక్ జిల్లా (6) తెలంగాణ సిద్ధాంతకర్త, ఉద్యమ స్ఫూర్తిప్రదాత ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతి సందర్భంగా గురువారం మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రొఫెసర్ జయశంకర్ సార్ చేసిన త్యాగాలు, అందించిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. తెలంగాణ ప్రజల హక్కులు, అభివృద్ధి, ఆత్మగౌరవ పరిరక్షణ కోసం ఆయన జీవితాంతం అంకితభావంతో కృషి చేశారని కొనియాడారు. తెలంగాణ ఉద్యమానికి సిద్ధాంతపరమైన దిశానిర్దేశం చేయడంతో పాటు ప్రజల్లో చైతన్యం కల్పించడంలో ప్రొఫెసర్ జయశంకర్ కీలక పాత్ర పోషించారని ఎస్పీ పేర్కొన్నారు. ఆయన ఆలోచనలు, సిద్ధాంతాలు, నిబద్ధత నేటి తరానికి స్ఫూర్తిదాయకమని తెలిపారు. తెలంగాణ అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ తమ బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించాలని ఎస్పీ సూచించారు. సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేందుకు పోలీస్ శాఖ నిరంతరం కృషి చేస్తోందని వెల్లడించారు.
అనంతరం పోలీస్ అధికారులు, సిబ్బంది ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఆయన సేవలను స్మరించుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆయన చూపిన మార్గదర్శకత్వం, ప్రజల పట్ల ఆయనకున్న నిబద్ధతను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, ఐపీఎస్, సీఐలు సందీప్ రెడ్డి, జార్జ్, ఆర్ఐ శైలేందర్తో పాటు పలువురు పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొని ప్రొఫెసర్ జయశంకర్ సార్కు ఘనంగా నివాళులర్పించారు.

