ప్రభుత్వ విద్యాసంస్థలను ప్రైవేట్ స్థాయికి తీర్చిదిద్దుతాం: ఎమ్మెల్యే
పాపన్నపేటలో మత్స్యకారులకు సభ్యత్వ కార్డుల పంపిణీ – కొత్త స్ట్రీట్ లైట్ల ప్రారంభం
కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ
A2న్యూస్, జూలై 17, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)
మెదక్ (16) మెదక్ నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు నిరంతరాయంగా కొనసాగుతున్నాయని ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ రావు పేర్కొన్నారు. గురువారం ఆయన పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొని శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించడంతో పాటు ప్రభుత్వ పథకాల లబ్ధిదారులకు ఆర్థిక సహాయ చెక్కులను పంపిణీ చేశారు. ముందుగా మెదక్ పట్టణంలోని 12వ వార్డులో ఉన్న టీజీటిడబ్ల్యూయూఆర్జేసీ (బాలికల) కళాశాలలో సుమారు రూ.4 కోట్ల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. విద్యార్థినుల కోసం హాస్టల్ భవనం, ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్, సీసీ రోడ్లు, యార్డ్ లైటింగ్ వంటి మౌలిక వసతుల నిర్మాణ పనులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివే ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడం రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రభుత్వ విద్యాసంస్థలను ప్రైవేట్ స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో పనిచేస్తోందని చెప్పారు. బాలికలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా విద్యాభ్యాసం కొనసాగించేలా అన్ని సౌకర్యాలు కల్పిస్తామని, మెదక్ నియోజకవర్గంలో విద్య, వైద్యం, రహదారులు, తాగునీరు తదితర రంగాల్లో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. అనంతరం పాపన్నపేట మండలం పోడుచంపల్లి గ్రామంలో మత్స్యకార సంఘ సభ్యులకు సభ్యత్వ కార్డులను పంపిణీ చేశారు. గ్రామంలో కొత్తగా ఏర్పాటు చేసిన స్ట్రీట్ లైట్లను ప్రారంభించి, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు.
తర్వాత పాపన్నపేట ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల లబ్ధిదారులకు మంజూరైన చెక్కులను పంపిణీ చేశారు. పేద, మధ్యతరగతి కుటుంబాల ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పించడమే ఈ పథకాల ప్రధాన ఉద్దేశమని ఎమ్మెల్యే తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్పర్సన్ కానుగు రాధిక, వైస్ చైర్పర్సన్ దొంతి నరేష్ గౌడ్, కౌన్సిలర్లు అనీస్ ఫాతిమా, హరిత, గంట సంపత్, రామకృష్ణ, గౌస్, నర్సింలు, కో-ఆప్షన్ సభ్యుడు తాహెర్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎం. గంగాధర్, నాయకులు రాగి అశోక్, భూపతి రాజు, కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు, విద్యార్థినులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

