తెలంగాణ యాసలో రచనలతో ప్రజలను చైతన్యపరిచిన ప్రజాకవి: జిల్లా అదనపు కలెక్టర్ నగేష్
A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) సెప్టెంబర్ 10:
మెదక్ జిల్లా (9) తెలంగాణ యాసలో సామాజిక రచనలు చేస్తూ ప్రజలను చైతన్యపరిచిన ప్రజాకవి, సామాజిక ఉద్యమకారుడు కాళోజీ నారాయణరావు సేవలు చిరస్మరణీయమని జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ అన్నారు. ప్రజాకవి, పద్మవిభూషణ్ కాళోజీ నారాయణరావు జయంతిని పురస్కరించుకుని బుధవారం కలెక్టరేట్లో నిర్వహించిన జయంతి కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ పాల్గొన్నారు. డీఆర్ఓ అంబదాస్ రాజేశ్వర్, బీసీ సంక్షేమ అధికారి ఉపేందర్, ఎస్సీ సంక్షేమ అధికారి సింధుతో పాటు కలెక్టరేట్ కార్యాలయ సూపరింటెండెంట్లతో కలిసి కాళోజీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ తెలంగాణ మాండలికంలో సామాజిక రచనలు చేస్తూ ప్రజలను సామాజికంగా మేల్కొల్పిన గొప్ప ప్రజాకవి కాళోజీ నారాయణరావు అని కొనియాడారు. సమాజంలో చైతన్యం తీసుకురావడానికి ఆయన చేసిన కృషి, అందించిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. కాళోజీ సేవలను గుర్తించిన ప్రభుత్వం ఆయనను పద్మవిభూషణ్ బిరుదుతో గౌరవించిందన్నారు. కాళోజీ నారాయణరావు జన్మదినాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ భాషా దినోత్సవంగా ప్రకటించి, ప్రతి సంవత్సరం అధికారికంగా జయంతి కార్యక్రమాలను నిర్వహిస్తోందన్నారు. కాళోజీ ఆశయాలు, రచనలు, సామాజిక స్పూర్తి భావితరాలకు ఆదర్శంగా నిలుస్తాయని అదనపు కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు చెందిన జిల్లా స్థాయి అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.

