గ్రామ అభివృద్ధి పనులపై సర్పంచ్ ఆధ్వర్యంలో చర్చలు
ఉపాధి అవకాశాలు, గ్రామ ప్రజల అవసరాలపై కీలకంగా సమావేశం
A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) సెప్టెంబర్ 2:
చేగుంట(1) మెదక్ జిల్లా చేగుంట మండలం పులిమామిడి గ్రామపంచాయతీ ఆవరణలో మంగళవారం ఉపాధి హామీ గ్రామసభ నిర్వహించారు. గ్రామ సర్పంచ్ రావిపల్లి శ్రీనివాస్రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ గ్రామసభకు పాలకవర్గ సభ్యులు, గ్రామపంచాయతీ కార్యదర్శి సబిత, ఉపాధి హామీ ఏఈ ముత్తయ్య, ఫీల్డ్ అసిస్టెంట్ బాబుతో పాటు గ్రామ ప్రజలు హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామంలో ఉపాధి హామీ పథకం కింద చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, ప్రజలకు కల్పించాల్సిన ఉపాధి అవకాశాలు తదితర అంశాలపై చర్చించారు. గ్రామ ప్రజలు తమ అవసరాలు, సమస్యలను గ్రామసభ దృష్టికి తీసుకురాగా, వాటిపై సంబంధిత అధికారులు మరియు పాలకవర్గ సభ్యులు చర్చించారు. గ్రామ అభివృద్ధితో పాటు అర్హులైన గ్రామస్తులకు ఉపాధి హామీ పథకం ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరంపై సమావేశంలో చర్చ జరిగినట్లు తెలిపారు.

