కొలతలు సరిపోని దుస్తులతో విద్యార్థుల అవస్థలు — ఆరు నెలలైనా పూర్తికాని పంపిణీ!
A2న్యూస్, మెదక్ జిల్లా చేగుంట ప్రతినిధి (రాము) సెప్టెంబర్ 12 :
చేగుంట (11) మండల కేంద్రంలోని పాఠశాలల్లో విద్యార్థులకు ప్రభుత్వం సరఫరా చేసిన యూనిఫామ్లపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. విద్యార్థుల కొలతలకు అనుగుణంగా కాకుండా దుస్తులు సరఫరా చేయడంతో అవి ధరించేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని తల్లిదండ్రులు, విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది విద్యార్థులకు షర్టు పెద్దగా, ప్యాంటు చిన్నగా, మరికొందరికి ప్యాంటు, షర్టు కొలతలు సరిపోని పరిస్థితి నెలకొన్నట్లు తెలుస్తోంది. దీంతో సరఫరా చేసిన యూనిఫామ్లను విద్యార్థులు పాఠశాలకు ధరించి రావడం కూడా కష్టంగా మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని చేగుంట మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ పరిశీలించి, సంబంధిత సిబ్బంది నుంచి వివరాలు ఆరా తీసినట్లు సమాచారం. కొలతలు సరిపోని దుస్తులను తిరిగి పంపించాలని సూచించినట్లు తెలుస్తోంది. అయితే తిరిగి పంపిన యూనిఫామ్లు మళ్లీ ఎప్పుడు వస్తాయి? విద్యార్థులకు సరైన కొలతల దుస్తులు ఎప్పుడు అందుతాయి? అనే ప్రశ్నలు తల్లిదండ్రుల్లో వ్యక్తమవుతున్నాయి. మరోవైపు పాఠశాలలు ప్రారంభమై సుమారు ఆరు నెలలు గడుస్తున్నప్పటికీ యూనిఫామ్ల పంపిణీ ప్రక్రియ పూర్తికాకపోవడంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల కొలతలు ముందుగానే సేకరించినప్పటికీ సరైన కొలతల దుస్తులు ఎందుకు సరఫరా చేయలేకపోయారనే అంశంపై అధికారులు సమగ్రంగా విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. విద్యార్థుల కోసం ప్రభుత్వం అందిస్తున్న యూనిఫామ్లలోనే ఇలాంటి లోపాలు చోటుచేసుకోవడంపై ఉన్నతాధికారులు స్పందించి, వెంటనే నాణ్యమైన మరియు సరైన కొలతల దుస్తులను అందించాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

