A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) సెప్టెంబర్ 4:
మెదక్ (3) భూపతిపూర్, సెప్టెంబర్ 4: ఎబిసి 3.0 (Awareness • Behaviour • Campaign) కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు జీవన నైపుణ్యాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. మెదక్ జిల్లా భూపతిపూర్లోని ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో సుమారు 250 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లైఫ్ స్కిల్స్ ట్రైనర్, ఎబిసి 3.0 ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీమతి సునీత రాకేష్ కొర్రపాటి విద్యార్థులతో ఇంటరాక్టివ్గా సంభాషించారు. కేవలం సమాచారం అందించడం మాత్రమే కాకుండా, జీవన నైపుణ్యాల ద్వారా విద్యార్థుల్లో సానుకూల ప్రవర్తనా మార్పును తీసుకురావడమే ఎబిసి 3.0 ప్రధాన ఉద్దేశమని తెలిపారు. “అవగాహనతో ఆలోచన మారాలి.. ఆలోచనతో ప్రవర్తన మారాలి.. ప్రవర్తనతో భవిష్యత్తు మారాలి” అనే లక్ష్యంతో విద్యార్థుల్లో బాధ్యతాయుతమైన, సురక్షితమైన, ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని పెంపొందించే దిశగా కార్యక్రమాలు కొనసాగుతున్నాయని వివరించారు. విద్యార్థుల వ్యక్తిత్వ వికాసం, ఆరోగ్యకరమైన ప్రవర్తనా మార్పుకు అవసరమైన పలు అంశాలపై అవగాహన కల్పించారు. ‘నన్ను నేను తెలుసుకోవడం – Knowing Myself’, వ్యక్తిత్వం, వ్యక్తిత్వ వికాసం – Personality & Personality Development, అలాగే పిల్లల రక్షణకు సంబంధించిన చైల్డ్ హెల్ప్లైన్ 1098 వంటి సహాయ సేవల గురించి వివరించారు.
విద్యార్థులు తమను తాము అర్థం చేసుకోవడం, తమ బలాలు–బలహీనతలను గుర్తించడం, సరైన నిర్ణయాలు తీసుకోవడం, ఇతరుల ప్రభావానికి లోనుకాకుండా బాధ్యతాయుతమైన ప్రవర్తనను అలవర్చుకోవడం వంటి అంశాలపై ప్రత్యేకంగా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీ సోలమన్ రాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖకు చెందిన సంకల్ప్ హబ్ నాగమణి, లైఫ్ స్కిల్స్ ట్రైనర్ శ్రీమతి సునీత రాకేష్ కొర్రపాటి, ఉపాధ్యాయులు, సుమారు 250 మంది విద్యార్థులు పాల్గొన్నారు.

