పురోగతిని ఫిర్యాదుదారులకు ఎప్పటికప్పుడు తెలియజేయాలి
– ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు
A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) సెప్టెంబర్ 8:
మెదక్ జిల్లా(7)ప్రజావాణిలో అందే ప్రతి ఫిర్యాదుపై చట్టబద్ధంగా, నిష్పక్షపాతంగా విచారణ జరిపి బాధితులకు సత్వర న్యాయం అందించాలని మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు పోలీసు అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఎస్పీ ప్రజల నుంచి వినతులు, ఫిర్యాదులను స్వీకరించారు. ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. భూ వివాదాలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక మోసాలు, వేధింపులు తదితర అంశాలపై అందిన ఫిర్యాదులను పరిశీలించి సంబంధిత అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేశారు. ప్రతి ఫిర్యాదుపై సమగ్ర విచారణ చేపట్టి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించారు. ఫిర్యాదుల పరిష్కారంలో ఎలాంటి జాప్యం చేయరాదని స్పష్టం చేశారు. విచారణ పురోగతిని ఫిర్యాదుదారులకు ఎప్పటికప్పుడు తెలియజేయాలని ఆదేశించారు. ప్రజలకు నాణ్యమైన పోలీసు సేవలు అందించడమే లక్ష్యమని ఎస్పీ పేర్కొన్నారు. సమస్యల పరిష్కారంలో పారదర్శకత, జవాబుదారీతనంతో వ్యవహరించాలని పోలీసు అధికారులకు సూచించారు.

