A2న్యూస్, మనోహరాబాద్ ప్రతినిధి (జల్లి రామకృష్ణ) సెప్టెంబర్ 8:
మనోహరాబాద్ (7) మెదక్ జిల్లా మనోహరాబాద్ మండల కేంద్రంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి ఎనిమిది దరఖాస్తులు వచ్చినట్లు ఎంపీడీవో కృష్ణమూర్తి తెలిపారు. ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. దండుపల్లి గ్రామానికి చెందిన నర్సింలు ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ జాబితా నుంచి భూమిని తొలగించాలని కోరుతూ దరఖాస్తు సమర్పించారు. కాళ్లకల్ గ్రామానికి చెందిన పి.సత్యం సర్వే నంబర్లు 368, 369కు సంబంధించిన సర్వే చేయాలని, ప్రభుత్వ భూములను పరిరక్షించాలని కోరారు. రంగాయపల్లి గ్రామంలోని సర్వే నంబర్ 250లో ప్రభుత్వ భూమి కబ్జాకు గురికాకుండా హద్దులు ఏర్పాటు చేయాలని కోరుతూ మరో దరఖాస్తు వచ్చింది. అదే గ్రామానికి చెందిన లలిత ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరారు. శేఖర్ అనే వ్యక్తి పెన్షన్, మిషన్ భగీరథ నీరు, రహదారి సమస్యల పరిష్కారంతో పాటు కాలుష్యానికి కారణమవుతున్న ఎంఎస్ అగర్వాల్ పరిశ్రమపై చర్యలు తీసుకుని తొలగించాలని కోరుతూ దరఖాస్తు సమర్పించినట్లు ఎంపీడీవో కృష్ణమూర్తి తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

