A2న్యూస్, మనోహరాబాద్ ప్రతినిధి (జల్లి రామకృష్ణ) సెప్టెంబర్ 6:
మనోహరాబాద్ (5) మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కూచారం గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు, నెరవేర్చని ఆరు గ్యారంటీలను ప్రజలకు వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చని హామీలను ప్రజలకు తెలియజేసేందుకు ‘కాంగ్రెస్ బాకీ కార్డులు’ పంపిణీ చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తోందని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ సీనియర్ నాయకులు నాయిని ఉదయ్ రంజన్ గౌడ్ మాట్లాడుతూ.. మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేయడమే లక్ష్యంగా పెట్టుకుందని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ మాజీ అధ్యక్షుడు దాసరి నరేష్ ముదిరాజ్, వార్డు సభ్యులు మలావత్ మంగ్యా నాయక్, యావాపురం లతా కృష్ణ, నాయకులు దుర్గం మధు గౌడ్, చింపుల మురళి తదితరులు పాల్గొన్నారు.

