క్రీడలతోనే క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాల పెంపు
చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలి: మల్టీ జోన్–I ఐజీ చంద్రశేఖర్ రెడ్డి
A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) ఆగస్టు 9:
తూప్రాన్ (8) తూప్రాన్ పట్టణంలోని ఓలంపియా స్కూల్లో నిర్వహిస్తున్న సి బి ఎస్ ఈ ఖో-ఖో ఛాంపియన్షిప్–2026 పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను మల్టీ జోన్–I ఐజీ చంద్రశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐజీ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, తాను పాఠశాల స్థాయిలో ఖో-ఖో, కబడ్డీ వంటి క్రీడల్లో పాల్గొనేవాడినని, ప్రస్తుతం టెన్నిస్ ఆడుతున్నట్లు తెలిపారు. విద్యార్థి దశ నుంచే క్రీడలపై ఆసక్తిని పెంపొందించుకోవాలని సూచించారు. చదువుతో పాటు క్రీడల్లోనూ పాల్గొనడం వల్ల విద్యార్థుల్లో శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, పట్టుదల, నాయకత్వ లక్షణాలు, టీమ్ స్పిరిట్ పెంపొందుతాయని అన్నారు. విద్యార్థులు తమకు ఇష్టమైన క్రీడలో నైపుణ్యాన్ని పెంపొందించుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. వివిధ ప్రాంతాల నుంచి ఛాంపియన్షిప్లో పాల్గొంటున్న క్రీడాకారులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. పోటీల్లో క్రీడాస్ఫూర్తితో, స్నేహపూర్వక వాతావరణంలో పాల్గొని తమ ప్రతిభను చాటుకోవాలని క్రీడాకారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్, సీఐలు వెంకట రాజా గౌడ్, సందీప్ రెడ్డి, తూప్రాన్ ఎస్ఐ గంగా రాజు, ఓలంపియా స్కూల్ యాజమాన్యం, ఉపాధ్యాయులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.

