ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ 92వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ
A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) ఆగస్టు 7:
మెదక్ జిల్లా (6) జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలో గురువారం ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ 92వ జయంతి వేడుకలను జిల్లా వెనుకబడిన తరగతుల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా రెవెన్యూ అధికారి అంబదాస్ రాజేశ్వర్ ముఖ్య అతిథిగా హాజరై, జడ్పీ సీఈఓ ఎల్లయ్య, డీఆర్డీఓ పీడీ శ్రీనివాసరావు, ఇతర జిల్లా అధికారులతో కలిసి ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి జ్యోతి ప్రజ్వలన చేసి, పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా డీఆర్ఓ అంబదాస్ రాజేశ్వర్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త, మేధావి ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ రాష్ట్ర సాధన కోసం జీవితాంతం చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఆయన ఆశయాలు, భావజాలాన్ని భావితరాలకు చేరవేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. జయశంకర్ ఆలోచనలు నేటి యువతకు స్ఫూర్తిదాయకమని తెలిపారు. కార్యక్రమంలో కుల సంఘాల ప్రతినిధులు, సభ్యులు, అధికారులు పాల్గొని ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల శాఖ అధికారి ఉపేందర్, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ సిబ్బంది, ఇతర అధికారులు పాల్గొన్నారు.

