A2న్యూస్, జులై 17, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)
మెదక్ జిల్లా(16) జిల్లా, జూలై 17: రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (Special Intensive Revision–SIR) కార్యక్రమానికి ఎన్నికల సంఘం (ఈ సి ఐ) షెడ్యూల్ను సవరించినట్లు జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. సవరించిన షెడ్యూల్ ప్రకారం బూత్ స్థాయి అధికారులు (BLOలు) ఆగస్టు 3వ తేదీ వరకు ఇంటింటికీ వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాలను సేకరిస్తారని గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఓటరు పేరు ఓటరు జాబితాలో నమోదు అయ్యేలా, అనర్హుల పేర్లు నిబంధనల మేరకు తొలగించే ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. ఇంటింటి సర్వే, ఫీల్డ్ వెరిఫికేషన్, దరఖాస్తుల పరిశీలన వంటి ప్రతి దశను అత్యంత జాగ్రత్తగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. బీఎల్ఓలు తమ పరిధిలోని ప్రతి ఇంటిని తప్పనిసరిగా సందర్శించి, ఓటర్ల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలని తెలిపారు. అలాగే అందిన దరఖాస్తులను ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా సకాలంలో పరిశీలించి పరిష్కరించాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ సూచించారు.

