నేటి నుండి పల్స్ పోలియో కార్యక్రమం – “నిండు ప్రాణానికి రెండు చుక్కలు”
-జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ పిలుపు
A2 న్యూస్, జూన్ 27, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)
మెదక్ 26:మెదక్ జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. ఈ నెల 28, 29, 30 తేదీల్లో నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమంలో 0 నుంచి 5 సంవత్సరాల లోపు ఉన్న 75,496 మంది చిన్నారులకు పోలియో వ్యాక్సిన్ అందించేందుకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా 457 పోలియో బూత్లు, మొబైల్ బృందాలు, ట్రాన్సిట్ బృందాలు ఏర్పాటు చేయడంతో పాటు మొత్తం 872 మంది సిబ్బందిని వ్యాక్సిన్ పంపిణీ, పర్యవేక్షణ తదితర విధుల కోసం నియమించినట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పల్స్ పోలియో కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ కోరారు. “నిండు ప్రాణానికి రెండు చుక్కలు” అనే నినాదంతో ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించడం తల్లిదండ్రుల బాధ్యత అని పేర్కొన్నారు. పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి కుటుంబం సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ నెల 28వ తేదీ (ఆదివారం) జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలు, అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలల్లో ఏర్పాటు చేసిన పోలియో బూత్లలో చిన్నారులకు వ్యాక్సిన్ అందజేస్తారు. అనంతరం 29, 30 తేదీల్లో ఇంటింటికి వెళ్లి బూత్లకు రాని చిన్నారులకు పోలియో చుక్కలు వేయనున్నట్లు తెలిపారు. జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని 0–5 సంవత్సరాల వయస్సు గల ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి వారి ఆరోగ్యాన్ని కాపాడాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ పిలుపునిచ్చారు.

