అధికారులకు డీఆర్వో అంబదాస్ రాజేశ్వర్ ఆదేశం
A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) సెప్టెంబర్ 1:
మెదక్ జిల్లా (31) జిల్లా: ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి అందిన ప్రతి దరఖాస్తును సంబంధిత శాఖల అధికారులు ప్రాధాన్యతగా తీసుకుని సత్వరమే పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో) అంబదాస్ రాజేశ్వర్ ఆదేశించారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలు, వినతులను అధికారులు స్వీకరించారు. ఈ సందర్భంగా మొత్తం 48 దరఖాస్తులు అందాయి. వీటిలో భూ భారతి సమస్యలకు సంబంధించి 16, ఇందిరమ్మ ఇళ్లకు 6, పెన్షన్కు 1, ఇతర సమస్యలకు సంబంధించి 25 దరఖాస్తులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా డీఆర్వో అంబదాస్ రాజేశ్వర్ మాట్లాడుతూ.. ప్రజావాణిలో అందిన ప్రతి దరఖాస్తును సంబంధిత శాఖల అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి, సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఫిర్యాదుల పరిష్కారంలో ఎలాంటి జాప్యానికి తావివ్వకుండా నిర్ణీత సమయంలో సమస్యలను పరిష్కరించి, వివరాలను సంబంధిత పోర్టల్లో నమోదు చేయాలని ఆదేశించారు. ప్రజల సమస్యల పట్ల అధికారులు బాధ్యతాయుతంగా స్పందించాలని, ప్రజావాణి ద్వారా అందిన వినతులకు సమర్థవంతమైన పరిష్కారం చూపాలని డీఆర్వో సూచించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ ఎల్లయ్య, డీఆర్డీఓ పీడీ శ్రీనివాసరావు, వివిధ శాఖల జిల్లా అధికారులు, సంబంధిత సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

